– హుస్నాబాద్ ఏసిపి సదానందం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంల పనిచేస్తాయని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో హుస్నాబాద్ ఏసిపి సదానందం, ఎస్సై లక్ష్మారెడ్డి ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, వీధుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసిపి సూచించారు. గ్రామాల్లో కొత్తగా ఏవైనా విగ్రహాలను ప్రతిష్టించాలనుకుంటే, సంబంధిత శాఖల నుండి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిబంధనలు పాటించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించేలా చూడాలని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడంపై అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులను కోరారు. పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండాలని, గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా లేదా ఏదైనా అనుమానాస్పద చర్యలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై లక్ష్మారెడ్డి కోరారు.



