జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు,వివిధ కుల సంఘాల నాయకులతో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి అదనపు కలెక్టర్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పండుగను సోదరభావంతో, శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజల సహకారంతో రంజాన్ పండుగను విజయవంతంగా పూర్తి సమన్వయంతో పండుగ జరపాలన్నారు.
ఈ సమావేశంలో మైనారిటీ సంక్షమే అధికారిని జయమ్మ, మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



