– అన్ని సబ్జెక్టుల్లో 20శాతం సిలబస్ తగ్గింపునకు బోర్డు నిర్ణయం
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
ఇంటర్మీడియట్ సిలబస్లో కాలానుగుణంగా ఉపయోగపడే విధంగా మార్పులు చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా అంశాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు సూచనలు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు మానవ, నైతిక విలువలు పెంచేలా కొత్త సిలబస్ రూపొందించాలని సూచించినట్టు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్తగా అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ కలయికతో కూడిన ప్రత్యేక గ్రూపునకు ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. భవిష్యత్లో సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్లే విద్యార్థులకు ఇది ఒక వరంగా మారనుంది.
ఒత్తిడి తగ్గించే దిశగా..
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా ఇంటర్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీసీ, బైపీసీ, గ్రూపుల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి ప్రధాన సైన్స్ సబ్జెక్టుల్లో దాదాపు 20 శాతం సిలబస్ను తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పోటీ పరీక్షల దృష్ట్యా కేవలం ముఖ్యమైన అంశాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీని ప్రకారం ఫస్టియర్, సెకండియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలోని కొన్ని పాఠ్యాంశాలను మార్చే అవకాశం ఉంది. సాధారణంగా ఫస్టియర్లో మ్యాథ్స్-ఏ సులభం అని, మ్యాథ్స్-బీ కష్టమని, అలాగే సెకండియర్లో మ్యాథ్స్-ఏ కష్టమని, మ్యాథ్స్-బీ సులువని మెజారిటీ విద్యార్థులు భావిస్తుంటారు. 2026-27 విద్యా సంవత్సరానికి 75 మార్కులు ఉండే మ్యాథ్స్ పేపర్కు ఇంటర్నల్ మార్కులను చేర్చాలని బోర్డు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయం వల్ల జూన్లో ప్రారంభం కానున్న అకడమిక్ ఇయర్లో ఫస్టియర్ విద్యార్థులకు 60 మార్కులకే పరీక్ష ఉండేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. సీబీఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానం ఉండాలనేది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది.
ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



