Sunday, November 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘనంగా ప్రారంభమైన సినిమాటికా ఎక్స్‌ పో 2025

ఘనంగా ప్రారంభమైన సినిమాటికా ఎక్స్‌ పో 2025

- Advertisement -

హాలీవుడ్‌ టు టాలీవుడ్‌ అనే కాన్సెప్ట్‌తో సినిమాకి సంబంధించి సాంకేతికత, సజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడానికి సినిమాటికా ఎక్స్‌పో ద్వారా సినిమాటోగ్రాఫర్‌ పి.జి విందా ముందుకొచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హెచ్‌ఐసిసిలో ‘సినిమాటికా ఎక్స్‌ పో 2025’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సినిక క్రియేటర్స్‌ కౌన్సిల్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, ఇండియా జారు సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, హీరో తేజ సజ్జ, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, నిర్మాతలు దిల్‌ రాజు, దామోదర్‌ ప్రసాద్‌ తదితరలు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ‘ఇండియాజారు సహాకారంతో సినిమాటికా ఎక్స్‌ పో కార్యక్రమం ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరగడం సంతోషం. క్రియేటర్స్‌, యాక్టర్స్‌, గేమర్స్‌, ఇన్వెస్టర్లు అందరూ ఈ వేడుకలో పాల్గొనటం అభినందనీయం.

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది. అలాగే హైదరాబాద్‌ ఇప్పుడు గ్లోబల్‌ హబ్‌గా మారిపోయింది. ఇరానీ చారు హోటల్‌ నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వరకు అన్ని సౌఖర్యాలు ఉన్నాయి. అలాగే క్రియేటివిటీకి సంబంధించిన అన్ని అంశాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. నేర్చుకోవాలి అనుకునే వారికి మల్టీమీడియా, వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ అన్ని విషయాల్లో హైదరాబాద్‌ దూసుకెళుతోంది. ఇండియాలో 25 శాతం విఎఫ్‌ఎక్స్‌ హైదరాబాద్‌లో రెడీ అవుతోంది. సిటీలో మొత్తం 400 వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు ఉన్నాయి. అలాగే 200 పైగా ఏవీజీసీ స్టూడీయోలను ఓటీటీ, గేమింగ్‌, ఫిల్మ్స్‌ కోసం క్రియేట్‌ చేశారు. అలాగే ఏఐకి సంబంధించిన కంపెనీలు ఏర్పడ్డాయి. 25 దేశాల్లో 30 వేల మంది క్రియేటర్లను 500 కంపెనీలను నెలకొల్పిన ఇండియా జారుకి ప్రత్యేక ధన్యవాదాలు. మూవీ ఫీల్డ్‌కు వచ్చే చాలా మందికి ఈ వేదిక ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది’ అని తెలిపారు.

‘ప్రస్తుతం సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ద్వారా కొత్త సాంకేతిక నిపుణులు, క్రియేటర్స్‌ పరిశ్రమకు వస్తారని ఆశిస్తున్నాను. హాలీవుడ్‌ సినిమాలను తలపించేలా ఇండియన్‌ సినిమాలు రూపొందుతున్నాయి. ఇకపై హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా హైదరాబాద్‌ వైపు చూసేలా ఒక ప్రయత్నం మొదలు పెట్టడం, దానికి సినిమాటికా ఎక్స్‌ పో ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. చాలా సినిమాల వీఎఫ్‌ఎక్స్‌ మన హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇకపై అన్ని సినిమాలు ఇక్కడే వీఎఫ్‌ఎక్స్‌ జరిగేందుకు ఈ వేదిక కషి చేస్తుందని ఆశిస్తున్నాను’ అని హీరో తేజ సజ్జ చెప్పారు. సినిమాటోగ్రాఫర్‌ పీజీ విందా మాట్లాడుతూ, ‘ఈ సంవత్సరం ‘హాలీవుడ్‌ టు టాలీవుడ్‌’ అనే థీమ్‌తో ముందుకెళ్తున్నాం. ఇది కేవలం నినాదం కాదు, భారతీయ సినిమాను గ్లోబల్‌ వేదికపై నిలబెట్టాలనే ప్రయత్నం. సినిమా, టెక్నాలజీ, ఆర్ట్‌, కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారతీయ సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. దీనికి మంచి రెస్పాన్స్‌ రావడం మరింత ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గొప్ప సహకారం అందించింది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -