నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ డివిజన్ సీఐటీయూ నాయకులను, ఆశా కార్యకర్తలను బాన్సువాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశవర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా బాన్సువాడ లోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం ఉదయం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఆశా కార్యకర్తలు వాహనంలో హైదరాబాద్కు బయలుదేరుతుండగా బోర్లం గ్రామం వద్ద పోలీసులు అడ్డుకుని, వారిని బాన్సువాడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18వేలు వేతనం ఇస్తామని హామీఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. ఆశా కార్యకర్తల సమస్యలపై మంత్రి, సీఎం స్పందించట్లేదన్నారు. అనేక సందర్భాల్లో ధర్నాలు చేస్తే స్పందించి హామీ ఇచ్చిన మంత్రి సీతక్క ఇప్పుడు ముఖం చాటేయడం ఎంతవరకు సబబని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆశ వర్కర్ల సమస్యలపై చర్చించాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి.పల్లవి, కవిత, సుజాత, సుచిత్ర, సుమలత, శ్యామల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



