Tuesday, June 17, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు సీఐటీయూ రాష్ట్ర నూతన కార్యాలయం ప్రారంభం

నేడు సీఐటీయూ రాష్ట్ర నూతన కార్యాలయం ప్రారంభం

- Advertisement -

– ముఖ్య అతిథులుగా తపన్‌సేన్‌, బీవీ.రాఘవులు, డాక్టర్‌ కె.హేమలత
– జెండా ఆవిష్కరించనున్న సీనియర్‌ నేత పి.రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సీఐటీయూ రాష్ట్ర కార్యాలయాన్ని (ఎన్‌వి.భాస్కరరావు స్మారక కేంద్రం)
శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో తొలుత సీనియర్‌ నేత పి.రాజారావు అరుణపతాకాన్ని ఎగురవేయనున్నారు. మొదటి అంతస్తును సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు, రెండో అంతస్తును అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత ఓపెనింగ్‌ చేయనున్నారు. ప్రారంభోత్సవ సభలో పై నేతలతో పాటు సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్‌.లక్ష్మయ్య, సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సీహెచ్‌.నర్సింగరావు, పూర్వ అధ్యక్షులు ఎంఏ.గపూర్‌, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీరయ్య, పూర్వ అధ్యక్షులు ఆర్‌.సుధాభాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్‌ మహానగరంలో కార్మికవర్గ ఉద్యమ విస్తరణలో కీలక పాత్ర పోషించిన ఎన్‌వి.భాస్కరరావు పేరిట కార్యాలయం నిర్మించిన విషయం విదితమే. పబ్లిక్‌, ప్రయివేటు రంగాల్లోని అనేక పరిశ్రమల్లో ఆయన కార్మికులను సంఘటిత పరిచి హక్కుల కోసం పోరాటం చేయించిన సంగతి తెలిసిందే.
కార్మికుల విరాళాలతోనే..
సీఐటీయూ కార్యాలయం నిర్మాణం మొత్తం కార్మికుల విరాళాలతోనే జరిగింది. తెలంగాణలో సీఐటీయూకు 2.5 లక్షల సభ్యత్వం ఉంది. అసంఘటిత, సంఘటిత రంగంలోని కార్మికులు, పబ్లిక్‌ సెక్టార్‌, భారీ, మధ్యతరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తమకు తోచినంత విరాళాలు ఇచ్చారు. సీఐటీయూ అనుబంధ సంఘాల్లోని ప్రతి అసంఘటిత కార్మికుని నుంచి కనీసం రూ.50 చొప్పున, మిగతా కార్మికుల నుంచి కనీసం రూ.100 చొప్పున విరాళాలు సేకరించారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల కార్మికులు తమ ఒక్క రోజు వేతనాన్ని సీఐటీయూ కార్యాలయం నిర్మాణానికి ఇచ్చారు. ఇలా నిర్మించిన కార్యాలయ ప్రారంభోత్సవం కూడా కార్మికుల మధ్యనే జరుగనున్నది. ప్రారంభోత్సవానికి అన్ని జిల్లాల కమిటీ సభ్యులు, ఆయా యూనియన్ల ఆఫీస్‌ బేరర్లు తరలిరానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -