కరీమ్నగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఉల్లంపలి గ్రామంలో ఓదెల మల్లన్న గుడివున్న గుట్టవద్ద 40 అడుగుల ఎత్తున్న రాతిగోడ మీద కొత్తరాతియుగంనాటి కొత్త రాతిచిత్రాలను శ్రీరామోజు హరగోపాల్, బీవీభద్రగిరీశ్, అహౌబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ లతో కూడిన కొత్త తెలంగాణచరిత్రబృందం గుర్తించింది. 79.234548 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18.184904డిగ్రీల ఉత్తర అక్షాంశాల మీద ఈ రాతిచిత్రాల తావు నైరుతిదిశ ముఖంగా ఉన్నది. ఈ చిత్రిత శిలాశ్రయంలో రాతిగోడమీద మూడుతావుల మూడు మూపురపుటెద్దుల తొక్కుడుబొమ్మలు (రాక్ బ్రూయిజింగ్స్) ఉన్నాయి. రెండింటి ముందర ఇద్దరు నిలబడివున్న మనుషుల ఛాయవంటి బొమ్మలున్నాయి. ఒక ఎద్దుబొమ్మ 2అడుగులకు మించిన ఎత్తు, 4 అడుగుల ఎత్తు, రెండవది 2 అడుగుల పొడవు, 2 అడుగుల ఎత్తు, మూడవది 2అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల ఎత్తుతో అగుపించాయి. ఇంత పెద్దగా తొక్కుడుబొమ్మలు కనిపించడం తెలంగాణాలో రేగొండ తర్వాత ఇది రెండవసారి.
మూపురపుటెద్దులు జననాంగాలతో కనిపించడం చాల్కోలిథిక్ పీరియడ్ రాతిచిత్రాల లక్షణమని పురావస్తుశాఖ పూర్వ డెరెక్టర్ వివి కష్ణశాస్త్రిగారు రాసారు. ఎరుపురంగు రాతిచిత్రాలున్న ఎడితనూరులో ఇటువంటి మూపురపుటెద్దులు మొదట కనిపించాయి. కొత్తరాతి యుగానికి చెందిన ఈ రాక్ ఆర్ట్ తొక్కుడుబొమ్మలు ప్రస్తుతానికి 6 వేల సంవత్సరాల క్రితం నాటివి. ఈ రాతిచిత్రాలను పరిశీలించిన రాతిచిత్రాల నిపుణులు, కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు బండి మురళీధర్ రెడ్డిగారు వాటి కాలాన్ని నిర్ధారించారు.
ఈ రాతిచిత్రాలతావున్న గుట్టమీద కొత్తరాతియుగం నూరుడుగుంటలున్నాయి. రాతిచిత్రాలతావుకు సమీపంలో వున్న మల్లన్నగుడి ముందర 16 అడుగుల ఎత్తైన నిలువురాయి (మెన్హర్) ఉన్నది.
చిగురుమామిడి మండలంలో చాలాచోట్ల మెగాలిథిక్ సమాధులు, అతిపెద్ద మూతరాళ్ళు గతంలో చరిత్రబృందం గుర్తించింది. తెలంగాణ వారసత్వశాఖ ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే, ఇదొక చరిత్రపూర్వయుగ పర్యాటక ప్రదేశంగా అభివద్ధి చేసే అవకాశముంది.
– శ్రీరామోజు హరగోపాల్
వందకు చేరువైనతెలంగాణ రాతిచిత్రాల తావులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES