మహారాష్ట్ర, కర్నాటక తీరుతో రాష్ట్రానికి నష్టం : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నీటి దోపిడికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా సీఎం ఎందుకు స్పందిచడం లేదని నిలదీశారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే, 112 టీఎంసీలు ఆపుకుంటామని కర్నాటక అంటుండగా, 74 టీఎంసీలు ఆపుకుంటామని మహారాష్ట్ర అంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే, పైన కృష్ణా నీళ్లు కర్నాటక మళ్లించుకుంటే తెలంగాణ పరిస్థితేంటని ప్రశ్నించారు. ”తెలంగాణకు బనకచర్ల పెను ప్రమాదంగా మారుతోంది. కేంద్రం అండతో ఏపీ ప్రభుత్వం బనకచర్లపై ముందుకెళ్తోంది. రేవంత్రెడ్డి దీన్ని అడ్డుకోకపోగా.. పరోక్షంగా సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారు.
బనకచర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్ట్ డీపీఆర్ను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి లేఖ రాశారు. దీనిపై రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు?” అని హరీశ్రావు ప్రశ్నించారు. సీఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా? స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ”మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు. నువ్వు నల్లమల పులివా.. పిల్లివా, ఎలుకవా.. ఎందుకు మాట్లాడటం లేదు. పులి అయితే మాట్లాడేవాడివి.. పిల్లివి, ఎలుకవు కాబట్టి మాట్లాడటం లేదు అని హరీశ్రావు ఘాటుగా విమర్శించారు. ఇప్పటి కైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేండుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.