నాకు, కేటీఆర్కు మధ్య బేధం సృష్టించాలన్న కుట్ర
నా గుండెల్లో కేసీఆర్, నా చేతిలో గులాబీ జెండా
మాజీమంత్రి హరీశ్రావు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. త్వరలోనే పతనం తప్పదనే సంగతి అర్థమై ఆయన ఆగమాగం అవుతున్నడని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే ఆయన కుర్చీ ఊడుతుందనీ, దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. తనకు, కేటీఆర్కు మధ్య బేధం సృష్టించాలన్న కుట్ర పనున్నతున్నారని పేర్కొన్నారు. తద్వారా బీఆర్ఎస్ను బలహీన పర్చాలని చేస్తున్నారని వివరించారు. ఆయన చిల్లర రాజకీయాలకు ఎవరు పడిపోరనీ, కుట్రలు, కుత్సితాలు ఫలించబోవని తెలిపారు. రేవంత్రెడ్డి రాసి పెట్టుకో ఎప్పటికైనా హరీశ్రావు గుండెల్లో ఉండేది కేసీఆరే, హరీశ్రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి దాష్టీకాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా తాను, కేటీఆర్ మరింత సమన్వయంగా, సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామని వివరించారు. కాంగ్రెస్ అవినీతిని ఎండగడతామనీ, అసమర్థతను నిలదీస్తామని తెలిపారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ను గద్దె దించుతామని పేర్కొన్నారు. తన లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది మంది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయమని పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. మిగిలిన కొద్ది కాలమైనా సరిగ్గా వినియోగించుకోవాలని రేవంత్రెడ్డికి సూచించారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదనీ, ప్రజలకు అక్కరకు వచ్చే మంచి పనులు చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమ ద్రోహిగానే కాకుండా, చేవలేని, చాతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతవని తెలిపారు.



