విజేతలకు నగదు, ప్రశంసా పత్రాలు
నవతెలంగాణ – భువనగిరి : తెలంగాణ పాపులేషన్ ఎడ్యుకేషన్ (ఎస్ సిఈ ఆర్ టి) సెల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కామిక్ రైటింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 6 నుండి 10వ తరగతికి చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఆలస్యం కాకముందే వద్దు అనండి” అనే నేపథ్యంతో వివిధ పదార్థాలు, వస్తువుల దుర్వినియోగం, బానిస కావడం పైన విద్యార్థులు కార్టూన్ల రూపంలో చిత్రాలు వేశారు.
ఈ పోటీలలో యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకు చెందిన ఏ. రవళిక (ఏడవ తరగతి) ప్రథమ బహుమతి, యాదగిరిగుట్ట కు చెందిన ఏ. యామిని (తొమ్మిదవ తరగతి) ద్వితీయ బహుమతి, రాయగిరి పాఠశాలకు చెందిన కే. అశోక్ (పదవ తరగతి) విద్యార్థులు తృతీయ బహుమతులు నగదును అందుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు గీసిన చిత్రాలు తెలంగాణా ఎస్ సి ఈ ఆర్ టి వారు త్వరలో వెలువరించే రాష్ట్ర స్థాయి సంకలనంలో ప్రచురిస్తారు. ఈ కార్యక్రమంలో జి.ప.ఉన్నత పాఠశాల రాయగిరి ప్రధానోపాధ్యాయులు ఎన్.అండాలు, జిల్లా కోఆర్డినేటర్ పెసరు లింగారెడ్డి, ఉపాధ్యాయులు ఎన్.క్రిష్ణారెడ్డి, సాబేరా,ఎన్.కృష్ణ,విద్యార్థులు పాల్గొన్నారు.