Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగోశాలల ఏర్పాటుకు కమిటీ

గోశాలల ఏర్పాటుకు కమిటీ

- Advertisement -

– పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించాలి : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలనీ, నిర్ణీత గడువులోగా ఆ కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలని సూచించారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలనీ, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ప్రభుత్వం ఖరారు చేయనున్నది. ఈ సమీక్షా సమావేశంలో సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్‌ రాజ్‌, అజిత్‌ రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ సవ్యసాచి ఘోష్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, పశుపోషణ విభాగం డైరెక్టర్‌ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -