Thursday, February 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపురపోరులో కాంగ్రెస్‌కే పట్టం

పురపోరులో కాంగ్రెస్‌కే పట్టం

- Advertisement -

రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్ల లో జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే తేల్చింది. అధికార పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్టు తెలిపింది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ జోరు కొనసాగుతుందని పేర్కొంది. కరీంనగర్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఫలితంగా ఆ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో తన బలాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనా ప్రకారం 68 నుచి 76 మున్సిపాల్టీలు కాంగ్రెస్‌, 29 నుంచి 36 మున్సిపాల్టీలను బీఆర్‌ఎస్‌, మూడు నుంచి ఐదు మున్సిపాల్టీల వరకు బీజేపీ గెలిచే అవకాశముందని తెలిపింది. 0 నుంచి 1 వరకు ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 8 నుంచి 14 మున్సిపాల్టీల్లో రెండు పార్టీల మధ్య కొద్దితేడాతో ఫలితాలు మారే అవకాశం ఉందని వెల్లడించింది.

మొత్తం 116 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ కు 36 శాతం, బీఆర్‌ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు వచ్చే అవ కాశాలు ఉన్నాయని పేర్కొంది. వార్డుల వారీగా చూస్తే.. కాంగ్రెస్‌ పార్టీ 1210 నుంచి 1290 వార్డుల్లో, బీఆర్‌ఎస్‌ 860 నుంచి 930, బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44, సీపీఐ 12 నుంచి 17, సీపీఎం 10 నుంచి 14, ఇతరులు 90 నుంచి 110 వార్డులు గెలుచుకునే అవకాశముందని సర్వే తెలిపింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌ మేకర్‌ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా గెలిచే అవకాశాలు లేవని తేల్చింది. అయితే వార్డుల వారీగా చూస్తే ఆ పార్టీ రెండో స్థానంలో నిలవనుందని పేర్కొంది.

బీకాన్‌ సంస్థ సర్వే…
బీకాన్‌ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 80-85 మున్సిపాల్టీలను గెలవబోతోందని అంచనా వేసింది. ఇక బీఆర్‌ఎస్‌ 8-10, బీజేపీ 4-6 మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోందని, 21 మున్సిపాల్టీల్లో హంగ్‌ లేదా ఇతరులు కైవసం చేసుకోబోతున్నట్టు తేల్చింది.

ఆపరేషన్‌ చాణ్యక్య సర్వే…
ఆపరేషన్‌ చాణక్య సర్వే ప్రకారం మొత్తం మున్సిపల్‌ వార్డుల్లో కాంగ్రెస్‌ 1400-1449 (48.0 శాతం) బీఆర్‌ఎస్‌ 745 -793 (26.06 శాతం), బీజేపీ 358-399 (13.04శాతం), ఎంఐఎం 150 -187(6.03 శాతం), జనసేన 30-35 (1.02 శాతం) ఇతరులు 80-119(4శాతం) కైవసం చేసుకోబోతున్నట్లు తేల్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -