భారత పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం రాక ముందే ఓటరు జాబితాలో ఆమె పేరును చేర్చారన్న ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అనంతరం సెషన్స్ కోర్టు సోనియాకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ దీనిపై వాదిస్తూ.. సోనియాగాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారని, అందుకోసం అవకతవకలకుపాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పునఃపరిశీలన అవసరమన్నారు. 1980లో ఓటర్ల జాబితాలో పేరు కోసం కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి.. మళ్లీ 1983లో తిరిగి చేర్చారన్నారు. ఈ రెండు కూడా సోనియాకు పౌరసత్వం రాకముందే జరిగాయన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు.. వివరణ ఇవ్వాలని సోనియాతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది. ఇక, గతంలో ఇదే విషయంలో మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీనిని పిటిషనర్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. ఈ నోటీసులు జారీ అయ్యాయి.
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -



