Thursday, June 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌లో తగ్గిన జననాలరేటు

భారత్‌లో తగ్గిన జననాలరేటు

- Advertisement -

సగటున రీప్లేస్‌మెంట్‌ రేటు 2.1 శాతం..
ఇక్కడ 1.9 శాతమే
40 ఏండ్ల తర్వాత కిందకి : ఐరాస వెల్లడి
ఇద్దరు పిల్లలు చాలంటున్న మహిళలు

జెనీవా : జనాభాపరంగా ఈ ఏడాదీ ప్రపంచంలోనే భారత్‌ నంబర్‌1 స్థానంలో కొనసాగుతోందని ఐరాస అనుబంధ సంస్థ ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా జనాభా 146 కోట్లకు చేరుకుంటుదని అంచనా వేసింది. స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ (ఎస్‌ఓడబ్ల్యూపీ) పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు తెలిపింది. అయితే జననాల రేటు నిర్దేశిత స్థాయి కంటే దిగువకు పడిపోయిందని వెల్లడించింది.
40 ఏండ్ల తర్వాత తగ్గుముఖం
ఐరాస నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో జననాల రేటు 1.9 శాతంగా ఉంది. ఏ దేశంలోనైనా సగటు ‘రీప్లేస్‌ మెంట్‌ రేటు’ కనీసం 2.1 శాతంగా ఉండాలి. కానీ, భారత్‌లో సంతానోత్పత్తి రేటు పడిపో యింది. జననాల రేటు తగ్గిపోయినప్పటికీ భారతదేశ జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతోందని ఐరాస కితాబిచ్చింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 146 కోట్ల దరిదాపుల్లో ఉంది. రాబోయే 40 ఏండ్లలో భారత జనాభా 170 కోట్ల గరిష్ట స్థాయికి చేరొచ్చు. ఆ తర్వాతి నుంచి జనాభా తగ్గుదల మొదలయ్యే అవకాశం ఉందని ఐరాస విశ్లేషించింది.
ఐరాస నివేదికలోని అంశాలివే
భారత్‌లోని 68 శాతం జనాభా 15 నుంచి 64 ఏండ్లలోపు వయో వర్గానికి చెందినది. ఇది వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌. అత్యధిక జనాభా వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌లో ఉండటం అనేది భారత్‌కు కలిసొచ్చే అంశం. ఈ ఏజ్‌లోని వారికి తగినన్ని ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతు లభిస్తే భారత్‌ ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తుంది.
భారత జనాభాలో 10-24 ఏండ్లలోపు వారు 26శాతం, 0-14 ఏండ్లలోపు వారు 24శాతం, 10-19 ఏండ్లలోపు వారు 17 శాతం మంది ఉన్నారు. అదే విధంగా 65 ఏండ్లకుపైబడిన వారు భారత్‌లో కేవలం 7 శాతం మందే ఉన్నారు. ప్రజల ఆయుర్దాయాలు పెరుగుతున్నందున రాబోయే కొన్ని దశాబ్దాల్లో 65 ఏండ్లకుపైబడిన వయో వర్గంలోని వృద్ధుల సంఖ్య మరింత పెరగొచ్చు.
2025 నాటికి భారతదేశంలోని పురుషుల సగటు ఆయుర్దాయం 71 ఏండ్లుగా, మహిళల సగటు ఆయుర్దాయం 74 ఏండ్లుగా ఉంది.
‘భారతీయ మహిళల వల్లే ఈ మార్పు’
1970వ దశకం నాటికి భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు ఐదుగురు పిల్లలని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని యూఎన్‌ఎఫ్‌ భారత విభాగం ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నర్‌ తెలిపారు. ‘భారత ప్రభుత్వం చొరవ వల్ల మహిళల్లో అవగాహన పెరిగింది. ఇప్పుడు భారతీయ మహిళలు సగటున ఇద్దరు పిల్లలకే జన్మనిస్తున్నారు. ప్రెగెన్సీ సమయంలో సంభవించే మరణాలు తగ్గిపోయాయి. అయితే ఈ విషయంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాలు, కులాలు, ఆదాయ వర్గాల్లో తేడాలున్నాయి. సంతానం ఎంతమంది ఉండాలనే దానిపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సంతానోత్పత్తిలో ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తూ, ఆర్థిక ఉన్నతిని సాధించే గొప్ప అవకాశం భారత్‌ ఎదుట ఉంది’ అని ఆండ్రియా పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల్లో సంతానోత్పత్తి సంక్షోభం
ప్రపంచ దేశాల్లో సంతానోత్పత్తి సంక్షోభం ఏర్పడిందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. కుటుంబ నియంత్రణ చర్యలు, గర్భనిరోధక సాధనాల వినియోగం, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎవరికి వారుగా సంతానోత్పత్తి నిర్ణయాలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వారి వ్యక్తిగత సంతానోత్పత్తి లక్ష్యాలను గుర్తించలేకపోయారని, జనాభా అంశంలో ప్రస్తుతానికి ఇదే నిజమైన సంక్షోభమని అని ఐరాస హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -