– 0-3తో కంగుతిన్న భారత్
– కాఫా నేషన్స్ కప్ ఫుట్బాల్
హిసోర్ (తజకిస్తాన్) : సెంట్రల్ ఆసియా ఫుట్బాల్ అసోసియేషన్స్ (సీఏఎఫ్ఏ) 2025 నేషన్స్ కప్లో భారత్ తొలి పరాజయం చవిచూసింది. గ్రూప్-బిలో ఆతిథ్య తజకిస్తాన్పై 2-1తో గెలుపొంది టోర్నమెంట్ను ఘనంగా మొదలెట్టిన టీమ్ ఇండియా.. గ్రూప్ దశ రెండో మ్యాచ్తో తడబడింది. శనివారం హిసోర్ సెంట్రల్ స్టేడియంలో ఇరాన్ చేతిలో 0-3తో భారత్ ఓటమి చెందింది. చీఫ్ కోచ్ ఖలీద్ జమిల్ ప్రథమార్థంలో (4-5-1) వ్యూహంతో ఇరాన్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో భారత్ సైతం పెద్దగా గోల్ దిశగా దండయాత్ర చేయలేదు. ఎటాకింగ్తో పాటు డిఫెన్స్లోనూ భారత్ మెరుగ్గా కనిపించినా.. ద్వితీయార్థంలో ఇరాన్ మూడు గోల్స్ కొల్లగొట్టింది. 59వ నిమిషంలో అమీర్హుస్సేన్ గోల్తో ఇరాన్ను 1-0తో ముందంజలో నిలిపాడు. స్కోరు సమం చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 89వ నిమిషంలో అలీ, అదనపు సమయంలో (90+6) తారేమి గోల్స్ కొట్టి భారత్ను ఊహించని షాక్ ఇచ్చారు. గ్రూప్-3బిలో రెండు మ్యాచుల్లో ఓ విజయం సాధించిన భారత్.. ఆఖరు మ్యాచ్లో అఫ్గనిస్తాన్తో తలపడనుంది. గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్కు చేరుకుంటాయి.