నవతెలంగాణ – హైదరాబాద్: భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియా కాక్పిట్ సిబ్బందికి విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ-టోక్యో మధ్య నడిచిన విమానాల్లో భద్రతా లోపాలు, నిబంధనల అతిక్రమణ ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా విమానాలను నడిపినందుకు ఈ నోటీసులు పంపింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ముఖ్యంగా ఢిల్లీ నుంచి టోక్యో వెళ్లిన AI-357, తిరుగు ప్రయాణంలో టోక్యో నుంచి ఢిల్లీ వచ్చిన AI-358 విమానాల నిర్వహణలో లోపాలు జరిగినట్లు డీజీసీఏ గుర్తించింది. ఈ విమానాలకు సంబంధించిన ‘మినిమమ్ ఎక్విప్మెంట్ లిస్ట్ (MEL)’ నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఇది కేవలం ఒక్కసారి జరిగిన పొరపాటు కాదని, గతంలోనూ వేరే సెక్టార్లలో ఇలాంటి ఉల్లంఘనలే జరిగాయని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్క్రాఫ్ట్ రూల్స్, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం.. బాధ్యులైన పైలట్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది.



