– భూమిలో తేమ లేక మొలకెత్తని గింజలు
– 60 మి.మీ., వర్షపాతం నమోదైతేనే నాటాలి
– వర్షాలపై నమ్మకంతో నాటిన రైతాంగం
– 40 శాతం కూడా మొలకెత్తని విత్తనాలు
– దిక్కుతోచని స్థితిలో దుక్కులు చెడగొడుతున్న రైతులు
రైతుభరోసా డబ్బులు పత్తి దుక్కులకే సరి..
– రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖరీఫ్ ఆరంభంలోనే పత్తికి విపత్తు ఎదురైంది. ఏప్రిల్, మే నెలల్లో చెదురుమదురు వానలు కురిశాయి. జూన్లో వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక కూడా ఆశాజనకంగా ఉంది. రైతాంగం సాగుకు సన్నద్ధమైంది. పత్తి దుక్కులు సిద్ధం చేసి ఆగమేఘాల మీద గింజలు నాటారు. ఆ తర్వాత మేఘం జాడ లేకపోవటంతో రైతాంగం ఉద్వేగానికి లోనవుతోంది. విత్తు మొలకెత్తక విలవిల్లాడుతోంది. ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఇస్తున్న ‘రైతు భరోసా’ డబ్బులు పోను పత్తికి అదనంగా వెచ్చించాల్సి వస్తుండటంతో రైతాంగం పంటి బిగువన దు:ఖం దిగమింగుతోంది. దూది పూల సాగు దు:ఖం తెప్పిస్తోంది. ఏటేటా పంట సాగు విస్తీర్ణం పెరుగుతున్నా, దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా, ధరల్లో మాత్రం పదేండ్లుగా పెద్ద వ్యత్యాసం ఉండటం లేదు. అయినా రాష్ట్రంలో భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు వరి తర్వాత అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఆర్నెళ్ల పంట 60 మి.మీ వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తనాలు నాటాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నా, చాలా మంది రైతులు వర్షాలపై ఆశతో జూన్ నెల ఆరంభం నుంచే అరకొర తేమకే విత్తనాలు వేశారు. రాష్ట్రంలో అధిక ప్రాంతాల్లో 20 శాతానికి పైగా లోటు వర్షాలు కురవడంతో సరైన పదును లేక గింజలు మొలకెత్తలేదు. బావులు, బోర్లున్న రైతులు తడులివ్వగా.. వర్షాధారంగా సాగు చేస్తే మాత్రం మరోసారి విత్తక తప్పనిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. భద్రాద్రి కొత్తగూడెంలో 2.14 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. ఉభయ జిల్లాలకు 10.10 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని నివేదిక పంపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 4.82 లక్షల చొప్పున విత్తనాలు అవసరం కాగా, ఈ మేరకు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ రూ.864 ఉంటే ఈ ఏడాది రూ.37 పెరిగి రూ.901కి చేరింది.
రూ.8వేలకు పైగా అదనపు భారం..
విత్తనాలు దెబ్బతిన్న రైతులు ఎకరానికి రూ.8వేలకు పైగా అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పంట చేతికి వచ్చే నాటికి ఏటా ఎకరానికి రూ.20వేల వరకు అదనపు పెట్టుబడులు తప్పడం లేదని పత్తి రైతాంగం ఆవేదన చెందుతోంది. ఎకరానికి ఒక్కో ప్యాకెట్ పత్తి విత్తనాలు రూ.901 చొప్పున కొనుగోలు చేశారు. అంటే ఎకరాకి రెండు ప్యాకెట్లకు రూ.1,802 చొప్పున వెచ్చించారు. డిమాండ్ ఉన్న విత్తనాలను ఒక్కో ప్యాకెట్ రూ.1500కు పైగా వెచ్చించి బ్లాక్లో కొనుగోలు చేశారు. విత్తనాలు నాటేందుకు దుక్కి సిద్ధం చేయడం కోసం, ఫ్లవ్ వేయడానికి రూ.మూడు వేలు కల్టివేటర్కు రూ.మూడు వేలు, రొటోవేటర్కు రూ. రెండు వేలు, అచ్చు తోలకానికి రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు రూ.600 చొప్పున మొత్తం రూ.11,328 వరకు ఎకరంలో విత్తనాలు నాటేందుకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఈ మొత్తం వెచ్చించి నాటిన విత్తనాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే 80శాతం వరకు మొలకెత్తుతాయి. గింజలు నాటిన ఐదోనాడు భూమిపై మొలకలు కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది విత్తనాలు నాటాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా పడలేదు. విత్తనాలు మొలకెత్తని రైతులు మొదటిసారి పెట్టిన పెట్టుబడిలో ఒక ఫ్లవ్ ఖర్చు రూ.మూడు వేలు మినహా మిగిలిన అన్ని పెట్టుబడులూ మళ్లీ వెచ్చించక తప్పదు. అంటే సుమారు రూ.8వేలకు పైగా ఒక్కో ఎకరానికి అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుంది. విపరీతంగా ఎండ కాస్తుండటం, పూర్తి పొడివాతావరణంతో విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు వాపోతున్నారు.
మళ్లీ విత్తాల్సిందే..
తెలంగాణలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే
పంట పత్తి. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్లో 1.34 కోట్ల
ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. దీనిలో
50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని లెక్కలు వేశారు. ఖమ్మం జిల్లాలో
పత్తి సాధారణ విస్తీర్ణం 2.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1.18 లక్షల
ఎకరాల్లో సాగు చేశారు. దీనిలోనూ సగం విస్తీర్ణంలో విత్తనాలు సరైన పదును లేక దెబ్బ తింటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాలకుగాను 35 లక్షల ఎకరాలకు పైగా నాటినా కనీసం 10-15 లక్షల ఎకరాల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు.
రైతుభరోసా పోను రూ.3వేలు వెచ్చించాలి
యండ్రపల్లి రవికుమార్, వల్లాపురం, ముదిగొండ
మూడున్నర ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టాను. ఎకరానికి రూ.11వేలకు పైగా ఖర్చు వచ్చింది. వర్షాలు లేకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. బట్టతడుపు జల్లు కూడా రావట్లేదు. బెట్ట కాలంతో గింజలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్లీ విత్తనాలు వేయక తప్పదు. మూడున్నర ఎకరాల పేరు మీద రూ.28వేలకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. ఎకరానికి రూ.6వేల రైతు భరోసా డబ్బులు పోను చేతినుంచి అదనంగా రూ.3వేలు ఖర్చు పెట్టాలి. మిగిలిన పంటలకు బయట అప్పు తెచ్చుకోక తప్పుదు.
60 మి.మీ వర్షం కురిస్తేనే నాటాలి..
సరిత, ఏడీఏ, కూసుమంచి
వర్షాలు కురుస్తాయని చాలా మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా గింజలు మొలకెత్తట్లేదు. 60 మి.మీ వర్షం కురిస్తేనే విత్తనాలు నాటాలని సూచిస్తున్నా, వర్షాలపై ఆశతో నాటుతున్నారు. భూమిలో సరైన తేమ లేక గింజలు మొలకెత్తకపోవడంతో మళ్లీ నాటాల్సి వస్తోంది.