హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె కోర్టులో సవాల్ చేశారు. తప్పుల తడకగా ఉన్న ఆ నివేదికను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు సమాచారం.