నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమార్థం అందిస్తున్న నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా చీరలను నాణ్యతతో అందించడం పట్ల గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు.
మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామాల వరకూ చేరుతున్నాయనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఛైర్మన్ రామ్ పటేల్, మేనూర్ మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, హన్మాండ్లు స్వామి, సురేష్ జుబ్రే, గంగారాం, మహిళ సంఘాల నాయకురాళ్లు, జిపి సెక్రటరీలు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



