కలిసికట్టుగా పనిచేయాలి : జూబ్లీహిల్స్పై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అందుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి సైతం గత నెల 31, ఈనెల ఒకటి, నాలుగు, ఐదు తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్షోలు నిర్వహించడంతోపాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో, క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్ర మాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, వ్యూహా, ప్రతివ్యూహాలు తదితర అంశాలపై సమీక్ష చేసినట్టు తెలిసింది. మొత్తం మంత్రులం దరికీ బాద్యతలు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
సీఎం స్థాయిలో తొలిసారి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సాధారణంగా ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం స్థాయిలో ప్రచారం చేయలేదు. రేవంత్రెడ్డి మాత్రం పలుమార్లు కార్నర్ మీటింగ్లు, ఇతరాల పేర పలుమార్లు నియోజకవర్గంలో కాలుపెట్టారు. మంత్రులకు సైతం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ కార్యాచరణ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నది. త్వరలో రెండో ఏడాది ప్రజా విజయోత్సవాలు సైతం ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా కమిటీనీ సైతం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకుపోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర స్టార్క్యాంపెయినర్లకు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండమ్గా భావిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ తేడా వస్తే ఢిల్లీలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎంతోపాటు మంత్రులూ భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈతరుణంలో కాలుకుబలపం కట్టుకుని ప్రచారంలో తిరుగుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరూ ఉప ఎన్నికల ప్రచారానికి రాలేదు. కేవలం ఒకే ఒక్క బహిరంగసభకు వచ్చి ప్రచారం చేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు. ఇంతవరకు కేసీఆర్ ప్రచారానికి రావడం లేదు. ఈనెల 11 పోలింగ్ ఉన్న విషయం విదితమే. తొమ్మిదో తేదీ వరకే ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. ఇంకా రెండు రోజులే బహిరంగ ప్రచారం మిగిలుంది. ఎన్నికకు నాలుగు రోజులుంది. ఈనేపథ్యంలో ఆయా ప్రయివేటు సంస్థల సర్వేలు, ఇతర ఏజెన్సీల నుంచి నివేదికలు తెప్పించుకు ఇటు సీఎం రేవంత్, అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ తమ బలాబలాలు బేరీజువేసుకుంటున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ సర్కారుకు ఇది సవాల్ కానుంది. గత పదేండ్లుగా బీఆర్ఎస్ సర్కారు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు ప్రచారంలో ఓటర్లకు వివరిస్తున్నారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతియేటా నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నారు. ఇదిలావుండగా బీఆర్ఎస్ మరోలా ప్రచారంయుద్ధం చేస్తున్నది. తాము ఐటీని భారీస్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున యువ నేత నవీన్యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత మధ్య బరి ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నిక పట్ల ఆసక్తి నెలకొంది.



