Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధైర్య పడకు బిడ్డా.. అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే పుట్ట

అధైర్య పడకు బిడ్డా.. అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

 మట్టిలో మాణిక్యానికి అండగా నిలిచిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ 
40 ఏండ్లు ఓట్లేసినోళ్లకు పైసా సాయం చేయని దుద్దిళ్ల కుటుంబం
ఎంబీబీఎస్‌ చదువుకు సాయం అందించమంటే స్పందించలేదు
తండ్రి ఆశయాలు చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే
జ్యోత్స్న ఎంబీబీఎస్‌ చదువు పూర్తి ఖర్చులను మేమే భరిస్తాం: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ వెల్లడి
నవతెలంగాణ – కాటారం

ఓట్లు వేసి అధికారం, పదవులు ఇచ్చిన పేదవర్గాలు ఇంకా ఆకలితో ఉంటూ సాయం కోరుతున్నారంటే అవమానపడాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. కాటారం మండల కేంద్రానికి చెందిన గంట వెంకటస్వామి కూతురు గంట జ్యోత్స్న ఎంబీబీఎస్‌ కోర్సు కోసం అవసరమయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ ప్రకటించారు. గురువారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా “గిఫ్ట్ ఏ స్మైల్ ” భాగంగా ఎంబీబీఎస్‌ చదువుతున్న గంట జ్యోత్స్నను కలిసి చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌ తన జన్మదినం సందర్బంగా చేసే కార్యక్రమాలు బీద ప్రజల ఆకలి తీర్చేలా ఉండాలని, వారి కళ్లలో ఆనందం కనబడాలని గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందులో బాగంగానే తాము జ్యోత్స్న కుటుంబానికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. అయితే కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న గత జనవరి మాసంలోనే తన ఎంబీబీఎస్‌ చదువుకు సాయం చేయాలని కోరుతూ  పేదరికం డాక్టర్‌ కలలకు అడ్డమని పలు పత్రికల్లో సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో తాము సైతం బీద బిడ్డకు అండగా నిలువాలని ప్రెస్‌మీట్‌లు నిర్వహించామని తెలిపారు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలు 40ఏండ్లుగా ఓట్లు వేసిన దుద్దిళ్ల కుటుంబం బీద బిడ్డ విషయంలోస్పందించలేదన్నారు.

ఇన్ని రోజులు దుద్దిళ్ల కుటుంబం స్పందిస్తుందని వేచి చూశామని, కానీ పేదల కష్టాలు, ఆకలి వాళ్లకు అవసరం లేదని, కేవలం ఓట్లు వస్తే నోట్ల సంచులతోవచ్చి ఓట్లు వేయించుకోవడం తప్ప ఇంకేది అవసరం లేదని అర్థం అయిందన్నారు. 40ఏండ్లు ఓట్లు వేసి అధికారం వేస్తే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఓ పేద కుటుంబంలో జరిగే పెండ్లికో, ఎవరైన చనిపోతనో, గరీబు బిడ్డ చదువులో నయా పైసా సాయం చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కాటారం మండల ప్రజలు ఆ కుటుంబానికి వేలలో మెజార్టీ ఇస్తుంటారని, అలాంటి మండలానికి చెందిన ఓ బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరమన్నారు. ఇక్కడ మనం ఓట్లు వేసి అధికారం ఇస్తే ధన్వాడలో ఒకటి, హైదరబాద్‌లో నాలుగు అద్దాల మేడలు నిర్మించుకుని ఆనందంగా ఉంటున్నారే తప్ప మన ఆకలి , కష్టాలను పట్టించుకోరన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్ల తర్వాత ఓ బీద బిడ్డ తన చదువుకు సాయం చేయాలని కోరడం, అదీ కాటారం కేంద్రంగా దాతల కోసం ఎదురుచూడటం దుద్దిళ్ల కుటుంబానికే అవమానమని ఆయన అన్నారు. ఓట్ల సమయంలో పేదలపై చూపించే ప్రేమ అధికారంలోకి వచ్చిన తర్వా త ఎందుకు చూపించడం లేదన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చుతానంటూ ప్రతిసారి మాట్లాడుతున్న మంథని ఎమ్మెల్యే తన తండ్రి ఆశయాలు ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదని, నియోజకవర్గ ప్రజలను చీకట్లో ఉంచడమే తండ్రి ఆశయమా అని ఆయన అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన తాను తన తల్లి చేసిన సేవలను స్పూర్తిగా తీసుకుని పదేండ్లుగా సాయం చేస్తున్నానని, సేవ చేయడం అంటే కన్పించాలే కానీ మాటల్లో కాదని ఆయన హితవు పలికారు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తే తనను అంతం చేయాలని చూస్తున్నారని, తాను చనిపోయే వరకు సమాజం కోసమే పోరాటం చేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. తాను మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీలోని ఎస్సీ బీసీలు దుర్బాషలాడుతూ మాట్లాడుతున్నారని, తనను తిట్టే సమయాన్ని ఇలాంటి బీదబిడ్డలకు సాయం చేయమని మంథని ఎమ్మెల్యేను అడుగాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -