Thursday, March 5, 2026
E-PAPER
Homeక్రైమ్నగరంలో డ్రగ్స్‌ సరఫరా

నగరంలో డ్రగ్స్‌ సరఫరా

- Advertisement -

– విదేశీయునితోపాటు మరో నిందితుడి అరెస్ట్‌
– 150గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, కత్తి, సెల్‌ఫోన్ల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విదేశీయునితోపాటు మరో నిందితుడిని హైదరాబాద్‌ నార్కొటెక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. వారి నుంచి 150గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, కత్తి, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25లక్షలుంటుందని డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు..
యెమెన్‌ దేశానికి చెందిన అల్‌-అకర్‌ అబ్బురబు మహమ్మద్‌ టోలీచౌకీలో నివాసముంటున్నాడు. పాలస్తీనాకు చెందిన హసన్‌ డబ్ల్యూ ఏ.హషీమ్‌ బెంగళూర్‌లో నివాసముంటూ డ్రగ్స్‌ సప్లరు చేస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో పలుసార్లు అరెస్టయినా వీరిలో మార్పు రాలేదు. ఇద్దరికీ జైల్లోనే పరిచయం ఏర్పడింది. అబ్బురబు వాట్సప్‌ ద్వారా నైజీరియాకు చెందిన సరఫరాదారుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నాడు. బెంగళూర్‌లో హసన్‌కు అందించేవాడు. వాటిని హైదరాబాద్‌కు తీసుకొస్తున్న నిందితులు ‘డెడ్‌-డ్రాప్‌’ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రయివేటు బస్సుల్లో రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు, హైదరాబాద్‌ నార్కొటెక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌తో కలిసి ప్రత్యేక నిఘా వేసి వారిని అరెస్టు చేశారు. విద్యార్థులు, ఐటీ నిపుణులు డ్రగ్స్‌ మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని డీసీపీ సూచించారు.
తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా వేయాలని కోరారు. ఎవరైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసినా, విక్రయించినట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ కె.శ్రీనివాస్‌, ఏసీపీ టి.శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఏం.ముత్త యాదవ్‌, జి.ఎస్‌ డ్యానియేల్‌, ఎస్‌ఐసీ వెంకటరాములు, ఎస్‌ఐ జి.ప్రశాంత్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -