జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ తో కలసి మాట్లాడారు. గత రెండు నెలలో కొత్తగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయని ఆరా తీసి డ్రగ్స్ ఏమైనా పట్టుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో మూత పడిన కంపెనీలు,చిన్న చిన్న కంపెనీల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.
మూత పడిన కంపెనీలలో ఏమైనా డ్రగ్స్ తయారీ,సరఫరా చేస్తున్నారా అని తనిఖీ చేసి రీ ఓపెన్ చేస్తే కేసులు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ షాపులు కూడా నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు.కొత్తగా గ్రామపంచాయతీ లు ఏర్పడినందున సర్పంచ్ లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి అందులో భాగంగా సర్పంచ్ లకు కూడా మత్తు పదార్థాల నియంత్రణ పై శిక్షణ ఇచ్చి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మున్సిపాలిటీలలో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి వార్డ్ మెంబెర్ లకు కూడా అవగాహన కల్పించి వార్డులలో ఏమైనా గంజాయి , మత్తు పదార్థాలు వాడుతున్నా ,ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని తెలిపారు.
జిల్లాలో అందరూ సమన్వయంతో డ్రగ్స్ నిర్మూలన జిల్లాగా ఉండేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహ రావు,వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.


