జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 26 పార్టీలు
న్యూఢిల్లీ : చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై ఈసీ కఠిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్టు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ.. తాజాగా రెండో రౌండ్లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలు, ఏపీ నుంచి 17 పార్టీలు ఉన్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఈసీ పేర్కొంది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో విఫలమైన రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించేందుకు, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే తొలి రౌండ్లో ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. రెండో రౌండ్లో మరో 476 పార్టీలను గుర్తించినట్లు వెల్లడించింది. తాము డీలిస్ట్ చేసిన పార్టీలేవీ.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ, 29బీ ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్ అండ్ ఎలాట్మెంట్) ఆర్డర్ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఇటీవల ఈసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరో 476 పార్టీల రద్దుకు ఈసీ చర్యలు..
- Advertisement -
- Advertisement -