పిఎన్ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్
నవతెలంగాణ – నకిరేకల్
సాంప్రదాయ కళల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ కోరారు. సోమవారం శాలిగౌరారం మండల కేంద్రంలో పిఎన్ఎం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన భారతీయ సంస్కృతిని నేటి విష సంస్కృతి కబళిస్తోందన్నారు. వృత్తి సాంప్రదాయాలు, జానపద కళారూపాలు క్రమంగా అంతరించిపోతున్నాయన్నారు. ఈ కళలే ఆధారంగా బతుకుతున్న అనేక కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయక కళలను ప్రోత్సహించి, ఆదరించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించాయని తీవ్రంగా విమర్శించారు.
కళాకారుల కష్టాలు తగ్గించేందుకు పెన్షన్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం వంటి సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలనే ప్రాతిపదికగా చేసుకొని ప్రజానాట్యమండలి చైతన్య పూరిత పాత్ర పోషిస్తోందన్నారు. కళ కళ కోసం కాదు — కళ ప్రజల కోసమే అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పిఎన్ఎం ప్రజలలో చైతన్య నింపేందుకు కృషి చేస్తుందన్నారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బట్ట రామచంద్రు, నాయకులు ఎర్ర శీను, గద్దపాటి రాము, దాసరి శంకర్, నిమ్మల రవి, అలాగే ప్రజాసంఘాల ప్రతినిధులు చలకాని మల్లయ్య, డెంకెల లింగయ్య, రావుల యాదయ్య పాల్గొన్నారు.



