Tuesday, October 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీ వర్గీకరణ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

బీసీ వర్గీకరణ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

పిటిషన్లపై హైకోర్టులో విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాకే ఎన్నికలు పెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని చెప్పింది. ఈలోగా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. వర్గీకరణ చేసే వరకు జీవో నెంబర్‌ తొమ్మిది అమలును నిలిపేయాలనే పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణను వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరణ చేయకుండా గంపగుత్తగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే కొన్ని బీసీ కులాలే లబ్ధి పొందుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మద్యం పాలసీపై స్టేకి హైకోర్టు నిరాకరణ
ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ విధానపరమైనదనీ, ఈ వ్యవహారంలో స్టే ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో నెంబర్‌ 93 ద్వారా ఆగస్టు 14న జారీ చేసిన మద్యం విధాన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన జి అనిల్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారించారు. దరఖాస్తు ఫీజు నాన్‌రీఫండ్‌ అమౌంట్‌ రూ.మూడు లక్షలుగా నిర్ణయించడం అన్యాయమని పిటిషనర్‌ వాదించారు. తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ అంత భారం అనుకుంటే దరఖాస్తు పెట్టకుండా ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. షాపుల కేటాయింపు, ఫీజుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని పిటిషనర్‌ న్యాయవాది కోరారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేశారు.

కేసు నమోదుకు ఆదేశాలివ్వండి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌ భూములపై స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నప్పటికీ ఆ భూములు అన్యాక్రాంతం జరిగేలా చేసిన అధికారులపై పోలీసులు కేసు నమోదుకు ఆదేశాలివ్వాలని సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నాగారం గ్రామంలోని సర్వే నెంబర్‌ 181లోని దాదాపు 50 ఎకరాల భూదాన భూముల లావాదేవీలపై దర్యాప్తునకు మహేశ్వరం పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌ దాఖలైంది. భూదాన్‌ బోర్డు కస్టోడియన్‌గా నవీన్‌ మిట్టల్‌, అప్పటి ఎమ్మార్వో మహమ్మద్‌ అలీ ప్రయివేట్‌ వ్యక్తులతో చేతులు కలిపి కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా చేశారంటూ దస్తగిరి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. కింది కోర్టు పిటిషన్‌ను కొట్టేయడాన్ని పిటిషనర్‌ సవాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -