తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2,2025 నాటికి పదకొండేళ్లు పూర్తి అవుతుంది. రాష్ట్రం పన్నెండవ ఏడాదిలోకి అడుగు బెడుతుంది. తెలంగాణను మొదటి ముఖ్యమంత్రిగా తెరాస (భారాస) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్లపాటు పాలించారు. 2024 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయన్ని ఇంటికి పంపి కాంగ్రెస్ను ఎన్నుకొన్నారు. ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో ప్రధాన పాత్ర వహించిన ఎ. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. కేసిఆర్, నిజాం నవాబును మించి ఒంటి స్థంభం మేడెక్కి తనపై గంపెడాశలుంచిన ప్రజలనే కాదు మంత్రులకు, తన పార్టీ ఎంఎల్ఏలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అడ్డగోలుగా నోరు పారేసుకోవడం, ప్రభుత్వ ప్రకటనల ద్వారా మీడియాపై వికృత నియంత్రణ, ప్రజా సమస్యలపై మీడియా సమావేశాల్లో చూపిన అసహనం, నిరుద్యోగులతో నిరంతర చెలగాటం కేసిఆర్కు ఎనలేని అపఖ్యాతి తెచ్చిపెట్టాయి. ఫలితం ఎన్నికల్లో ఓటమి మాత్రమే కాదు తన పార్టీ టికెట్లపై గెలిచిన వారు కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి దూకేశారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదంలో ప్రత్యేక తెలంగాణ మలి ఉద్యమం సాగింది. తొలి ఉద్యమానికి నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి తెలంగాణ ప్రజా సమితిని (టిపిఎస్) కాంగ్రెస్లో కలిపేశారు. అలా కలిపేసేందుకు ఎన్నికలకు ముందే ఇందిరా గాంధీతో ఒప్పందం జరిగిందని తాను చనిపోవడానికి మందు జి.వెంకటస్వామి బయట పెట్టారు. టిపిఎస్ నుండి ఎన్నికైన వారిలో కొందరికి కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు లభించాయి. చెన్నారెడ్డికి గవర్నర్గిరి దక్కింది. ఆ తర్వాత మధ్యలో తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి కొందరు కాంగ్రెస్ సీనియర్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ప్రయత్నాలు చేసినా ప్రజలు గత అనుభవంతో విముఖత చూపారు.
దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత తాను ఆశించిన మంత్రి పదవి ఇవ్వకుండా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను అవమానించారన్న కసితో కేసిఆర్ తెరాసను ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న ప్రధాన నినాదంతో జనంలోకి వెళ్లారు. జనం నుండి భారీ స్పందన వచ్చింది. కాంగ్రెస్ నాయకులూ తెరాసలో చేరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఉన్న ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు తెరాస నాయకత్వంలోని ఉద్యమంలోకి దూకారు. కేసిఆర్ తన రాజకీయ చతురతతో, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అసమర్ధత ప్రేలాపనలను వాడుకొని, ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమానికి దూరంగా ఉన్న వివిధ వృత్తుల వారిని కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి తేగలిగారు. చివరికి కాంగ్రెస్ అభిష్టానం ఇచ్చిన పరోక్ష సంకేతాలతో రాష్ట్ర కాంగ్రెస్లోని బలమైన సెక్షన్లు ప్రత్యేక వేదికలు ఏర్పర్చుకొని కేసిఆర్తో చేతులు కలిపాయి. రాష్ట్రాల విభజనను సమర్థించే బిజెపి కూడా పావులు కదిపింది. తెలంగాణ ప్రాంతం చేజారరాదన్న ఎత్తుగడతో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు అంగీకరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ చావుదెబ్బతింది.
రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాక 2014లో జరిగిన ఎన్నికల్లో ‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు’ అన్న తెరాస నినాదానికి ప్రజలు అఖండ విజయం చేకూర్చారు. కామధేనువు లాంటి హైదరాబాదు నగరం ఎలాగూ తెలంగాణలో ఉండిపోతుంది కనుక ప్రభుత్వం దగ్గర డబ్బుకు లోటు లేదు. ఆదాయం ఉంది కనుక అప్పులిచ్చే వాడికి మాత్రం అభ్యంతరం ఏముంటుంది? ఎంఎల్ఏల జీతాలు పెంచాడు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాడు. ఉద్యోగ విరమణ వయసు పెంచాడు. చంద్రబాబు కంటే అధికుడనని చూపెట్టుకోవడానికి చేయగలిగిందంతా చేశాడు. తెలంగాణలో తేదేపాకు నూకలు చెల్లకుండా చేశాడు. కాంగ్రెస్ వెన్ను విరిగిందని, అది ఇక లేచి నిలబడ లేదని తప్పుడు అంచనా వేశారు. నియంతలా మారి గాజు గదిలో తనను తాను బంధించుకొన్నాడు.
నీళ్ల విషయంలో దూకుడు ఎక్కువైనా తెలంగాణకు చాలా వరకు కేసిఆర్ న్యాయం చేశాడు. కృష్ణానదిపై ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలను పూర్తి చేశారు. మహాబూబ్నగర్, నల్గొండ జిల్లా స్వరూపాలను చాలావరకు మార్చారు. నలభైఏళ్లుగా ఎండిపోయిన చెరువులు తిరిగి నిండేట్లు చేశాడు. పాతాళానికి జారిన భూగర్భ నీటి మట్టాలు మళ్లీ పైకి వచ్చాయి. కరెంట్ కోతలూ ఆగిపోయాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల్లో అవినీతి మాటెలా ఉన్నా చాలా చెరువుల్లో పూడిక తొలగింది. ప్రతి ఇంటికి ఆలస్యంగానయినా నల్లా నడిచొచ్చింది. ఇంత చేసి ఇంటెనుక చచ్చిన్నట్లు 2024 ఎన్నికల్లో స్వయం కృతాపరాదం వల్ల కేసిఆర్ మట్టి కరిచారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్లు చట్టసభలు, స్థానిక సంస్థలు అన్న తేడాలేకుండా ప్రజాప్రతినిధులు భారాస నొదిలి అధికార పార్టీ పంచన చేరారు.
గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాది తిరిగేసరికి కళ్లు తేలేశాడు. గత ప్రభుత్వం బొక్కసంలో బొమికలు తప్ప ఏమీ మిగల్చలేదని, అది చేసిన అప్పులు తీర్చడానికే తెలంగాణ ఆదాయం సరిపోతుందని గావుకేకలు మొదలెట్టారు. తనను కోసినా, నరికినా పైసా రాలదని బహిరంగ సభలో ఏడుపు లంకించుకొన్నారు. కేసిఆర్కు ఆయన భాషలోనే జవాబు చెప్పడం, దూషించడంతో పాటు రాష్ట్ర ఆర్థికస్థితిపై పేద అరుపులు మొదలెట్టారు. వడ్డీలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వ రాబడి అంతా సరిపోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెంచడం, రిటైరైన వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం తన చేత కాదన్నారు. రైతు భరోసాను సకాలం చెల్లించే స్థితిలో లేదు. అలాగని పెద్దపెద్ద భూకమతాలకు రైతు భరోసాను ఆపేసే చిత్తశుద్దీ చూపలేదు. రుణ మాఫీ సక్రమంగా జరగలేదు.
లాండ్రీలకు క్షౌరశాలల కరెంట్ బిల్లులు వందల కోట్లు బకాయి పడ్డాయి. ట్రాన్స్కో నుండి రజకులకు, క్షురకులకు వేధింపులు పెరిగాయి. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలను క్రమంగా డొల్లబారుస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారు గురుకులాల వల్ల చాలా ప్రయోజనం పొందారు. వాటి వల్ల వారికి ఉన్నత విద్యావకాశాలు లభించాయి. రేవంత్ గురుకుల పాఠశాలలను నీరు కార్చుతున్నారు. ఆ భవనాలకు రెండేళ్లుగా అద్దెలు కూడా చెల్లించడం లేదు. విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను వేశారు. నిధులు నిలిపేశారు. ప్రయివేట్ డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థుల రియంబర్స్మెంట్లు ఆగిపోయాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. కొందరు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు ఆగిపోయాయి. అవసరమైన టీచర్ల, ఉద్యోగుల రిక్రూట్మెంట్ జరగడంలేదు. నిరుద్యోగులతో రేవంత్ కూడా చెలగాటం మొదలెట్టారు. వివిధ రంగాల్లో కమిషనర్లను, చైర్మన్లను రాజకీయ అవసరాల వల్ల నియమించినా వారి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. రబీ పంట కొనుగోళ్లు ఇప్పటికీ సగం కూడా కాలేదు.
కామారెడ్డి డిక్లరేషన్ అంటూ తన ఎన్నికల హామీలకు విశేష ప్రచారం కల్పించి, ఆ ప్రకారం పెన్షన్లు ఇవ్వలేదు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకున్నా అనేక పథకాలకు భవనాలకు శంకుస్థాపనలు చేస్తూ ప్రభుత్వం ప్రజల కళ్లనీళ్లు తుడుస్తోంది. తెలంగాణ ఆర్థికంగా దివాళా తీసిదంటూనే అందాల పోటీలు నిర్వహించి హెచ్చులకు పోయింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాధనాన్ని ఆ పోటీల నిర్వహణపై వెచ్చించింది. మహిళలను కించపరిచి, వారిలో ఆత్మ న్యూనతా భావాన్ని కల్గించే పోటీలను ముఖ్యమంత్రి తలకెత్తుకొన్నారు. వాటి వల్ల విదేశీ కంపెనీలు రాష్ట్రంలో వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి మందుకొస్తాయంటూ మోకాలుకు బోడిగుండుకు సిఎం ముడేస్తున్నారు. కేటీఆర్ మెడకు ఫార్ములా వన్ రేస్ చుట్టుకొన్నట్లే ఈయన మెడకు అందాల పోటీలు చుట్టుకోక మానవు. అందాల పోటీల అంతరార్ధం ఏమిటో పోటీనుండి తప్పుకొన్న బ్రిటిష్ మహిళ ఒకరు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది కూడా. ముఖ్యమంత్రి పర్యటనలకు ముందే ఆ ప్రాంతలోని సీపీఎం, తదితర పార్టీల నాయకులను ముందుగానే అరెస్టు చేస్తూ కేసిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాష్ట్రానికి రావల్సిన డబ్బును కేంద్రం నుండి రాబట్టుకోవడంలో వేడుకోలకే పరిమితం అవుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు నిధుల విడుదలపై కేంద్రాన్ని నిలదీశాయి. విద్యార్థిగా ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ అంతటి చొరవ, పట్టుదల చూపెట్టే స్థితిలో లేరు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోయాయి.
భారాస, బీజేపీల మధ్య సాగుతున్న దాగుడుమూతలను కేసిఆర్ కూతురు కవిత రాసిన లేఖ బయటపెట్టింది. కేసిఆర్ దివాళా కోరు ఎత్తుగడ వల్ల రాష్ట్రంలో బీజేపీకి కాళ్లోచ్చాయి. నిజామాబాదులో స్వయంగా కవిత ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిచారు. సికిందరాబాదులో భారాస బలహీన అభ్యర్థిని నిలబెట్టింది. రాజకీయ విశ్లేషకులు ఊహించినట్లుగానే గత ఎన్నికల్లో భారాస నాయకత్వం వేసిన ఎత్తుగడలు ఆ పార్టీ పాలిట ఉరితాళ్లయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల విస్తారమైన ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందినా కేసిఆర్ తొందరపాటు, అవినీతి, ఇంజనీర్లు నిర్ణయించాల్సిన విషయాల్లో కేసిఆర్ వేలుబెట్టడం ఇప్పుడు తన ప్రాణం మీదికి తెచ్చింది. కేసిఆర్ పాలనలో వ్యవసాయ పంటలు, పండ్లు, చేపల ఉత్పత్తులు పెరిగాయి. అయినా ప్రజల దృష్టిలో కేసిఆర్ను కాంగ్రెస్ అవినీతి పరుడిగా నిలబెట్టగలిగింది. రేవంత్ ప్రభుత్వ ధోరణి కూడా ఇలాగే ఉంటే తెలంగాణలో ‘తఖ్త్ పలట్ భీ సక్తా’.
– ఎస్. వినయ కుమార్ ,
99897 18311
పదకొండేళ్ల తెలంగాణ
- Advertisement -
- Advertisement -