Thursday, July 17, 2025
E-PAPER
Homeజిల్లాలుటీబీ ముక్త్ భారత్ అభియాన్ లో అందరూ భాగస్వాములు కావాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో అందరూ భాగస్వాములు కావాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

- Advertisement -

టీ.బీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

క్షయ వ్యాధి రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై రాష్ట్ర గవర్నర్ బుధవారం కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమిష్టి కృషితోనే సమగ్ర ప్రగతి కల సాకారం అవుతుందని, ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం అధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు అన్ని వర్గాల వారు తోడ్పాటుగా నిలువాలని హితవు పలికారు.

ప్రతి ఒక్కరు తమకంటూ ఏదైనా ప్రతిభను కలిగి ఉంటారని, దానిని సమాజ ప్రగతి కోసం వినియోగించాలని, దీనిని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలని అన్నారు. సామాజిక, సాహితీ, సేవా, క్రీడా తదితర అన్ని రంగాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, తమతమ రంగాల ద్వారా ఆయా మాధ్యమాలను ఉపయోగిస్తూ క్షయ వ్యాధి నిర్మూలన కోసం కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ, గుగులోత్ సౌమ్యలను టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరించాలని గవర్నర్ కోరారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా, కళాకారులు ప్రదర్శనల ద్వారా ప్రజలను టీ.బీ నిర్మూలన దిశగా చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, రెడ్ క్రాస్ సొసైటీ చక్కటి సమన్వయం ఏర్పర్చుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు స్క్రీనింగ్ క్యాంపులను విస్తృతంగా నిర్వహించి టీబీ కేసులను గుర్తించాలన్నారు. టీబీ నిర్మూలనకై చేపడుతున్న కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయిన పేషెంట్లకు దాతల ద్వారా పోషక ఆహార కిట్లను అందించాలన్నారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో స్థితిగతులు, భౌగోళిక స్వరూపం, ప్రాముఖ్యతల గురించి ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ దృష్టికి తెచ్చారు. క్షయ వ్యాధి నిర్మూలన చర్యలలో భాగంగా హై రిస్క్ గ్రూప్ లో ఉన్న వారందరికీ స్క్రీనింగ్, ఎక్స్ రే చేయిస్తున్నామని, టీ.బీ లక్షణాలు ఉన్నవారికి తెమడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విరివిగా ఎక్స్ రే పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. స్వచ్చంధ సంస్థలు, దాతల సహకారంతో టీ.బీ పేషంట్లకు పోషకాహార కిట్లను అందిస్తున్నామని అన్నారు. టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ, లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. క్షయ నిర్మూలన కోసం విశేషంగా చేసిన కృషి వల్ల 2022-23 సంవత్సరానికి గాను జిల్లాకు గోల్డ్ మెడల్ దక్కిందని అన్నారు.

తలసేమియా బాధితులకు అవసరమైన బ్లడ్ యూనిట్లను రెడ్ క్రాస్ ద్వారా సమకూరుస్తున్నామని, వృద్ధుల కోసం రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగంల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యధిక సభ్యత్వాలు, విస్తృత సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణను గుర్తిస్తూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి ఇప్పటికే అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయని అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. ఇదే స్పూర్తితో పని చేస్తూ, క్షయ నివారణలో నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలుపాలని సూచించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -