ముందు నుయ్యి.. వెనుక గొయ్య… ఈ సామెత ఇప్పుడు తెలంగాణ రైతుకు సరిగ్గా సరిపోతుంది. నీళ్లు లేని బావికి గిలకలెక్కువ… అనే చందాన ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ధాన్యం పండించిన రైతులు ఇప్పుడు దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుత యాసంగిలో వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. 57 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని సర్కారు అంచనా వేసింది. ఇందులో అరవై లక్షల టన్నులు మార్కెట్కు వస్తుందంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. మొత్తం 8,600 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,300కి కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం హామీనిచ్చింది. ఇప్పటికే పదిశాతం పంట దిగుబడి మార్కెట్కు వచ్చింది. అయితే అకాల వర్షాల వల్ల ఆయా మార్కెట్లలోని ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల వల్ల దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఎకరాకు రూ.పది వేల చొప్పున సర్కారు ప్రకటించింది. వరి, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలు కూడా ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాతావరణం మారటంతో మళ్లీ వానలు పడే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. యాసంగిలో పంటలు చేతికొచ్చిన వెంటనే నిర్ణీత సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఎంతో మంది రైతులు ఒడ్డున పడేవారు. కానీ పౌరసరఫరాలశాఖ ఆ పని చేయకపోవటం విస్మయం కలిగించే అంశం. ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ఆ శాఖ…చాలా ఆలస్యంగా నిద్రలేచింది. కల్లాల దశలోనే ఆయా కేంద్రాలను ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం కల్పించాల్సిన ప్రభుత్వం… అందుకు విరుద్ధంగా నెల రోజులపాటు తాత్సారం చేసింది. దీంతో ప్రయివేటు మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగారు. దీంతో రైతులకు క్వింటాల్ మీద రూ.500 నుంచి రూ.600 వరకు నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే క్వింటాల్కు రూ.2,025 (మొదటి రకానికి) చెల్లించాలి. అదే రెండో రకానికైతే రూ.1,950 పలుకుతోంది. కానీ ప్రభుత్వ సహకారం లేకపోవటం, అకాల వర్షాల భయంతో రైతులు వచ్చినకాడికి చాల్లే అనుకుని మిల్లర్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఫలితంగా అతి తక్కువ ధరకు వారు వడ్లను అమ్ముకున్నారు.
వాస్తవానికి అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. రైతుబంధు (రైతు భరోసా) సకాలంలో ఇవ్వకపోవటం, రుణమాఫీ సరిగ్గా కాకపోవటం, వరికి బోనస్ వెంటనే చెల్లించకపోవటంతో రైతులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. పై పథకాలన్నీ రాష్ట్రం లోని అన్నదాతలందరికీ ఒకే విడతలో, ఒకేసారిగాక దఫదఫాలుగా అమలవుతూ వస్తున్నాయి. దీంతో వారికి ప్రభు త్వం అందిస్తున్న సాయం అనుకున్నంత స్థాయిలో అక్కరకు రావటం లేదు.
మరోవైపు విత్తనోత్పత్తి రాష్ట్రంలో విత్తనాల కల్తీ అనేది వ్యవస్థీకృతమైంది. విత్తన వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలను యధేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని నియంత్రించి, నిరోధించాల్సిన ప్రభుత్వం, వ్యవసాయశాఖ చేష్టలుడిగి చూస్తున్నాయి. మార్కెట్ కమిటీలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విత్తనాలను సరఫరా చేయటం ద్వారా ఈ కల్తీలను అరికట్టవచ్చు. సర్కారుకు ఒక్కపైసా భారం లేని పనిది. అయినా ఈ అంశంపై ప్రభుత్వాధినేతలు దృష్టి సారించకపోవటం శోచనీయం. ఈ క్రమంలో ఇప్పటికైనా అన్నదాతను కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చాలినన్ని నిధులు కేటాయించాలి.
ముఖ్యంగా అకాల వర్షాలు, వడగండ్ల వానల సమయాల్లో వారిని కడగండ్ల నుంచి గట్టెక్కించాలి. మొన్నటి వానల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రకటించిన పంట నష్ట పరిహారాన్ని వెంటనే అందించాలి. ఇది ఒక విధానంగా ఉండాలి. అప్పుడే రాష్ట్రంలో సాగు మరింత బాగుపడుతుంది.
రైతు గోస…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES