15న తలపెట్టిన ఫీజు పోరు దీక్షకు సంపూర్ణ మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్సమెంట్, స్కాలర్షిప్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిశారు. ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ఫీజు పోరు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ… నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నెముకగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో విద్యార్థులు ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని వాపోయారు. కోర్సులు పూర్తి చేసినా బకాయిల సాకుతో విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పైచదువులు, ఉద్యోగ అవకాశాలను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కనీస హక్కు అయిన ఫీజుల విషయంలో మొండివైఖరి ప్రదర్శించకుండా బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ, పెండింగ్ స్కాలర్షిప్లను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని, సర్టిఫికెట్లు ఆపేసిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



