పరకాల ఆర్డీవో కార్యాలయంలో డీఎస్పీ నాయకుల వినతి
నవతెలంగాణ -పరకాల
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) పరకాల మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహశీల్దార్ విజయలక్ష్మికి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మండల కోఆర్డినేటర్ బొచ్చు నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు కళాశాలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థులు, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డీఎస్పీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు పొనగంటి శ్రీకాంత్, నాగేంద్ర బాలు తదితరులు పాల్గొన్నారు.



