నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తన లారీని 44వ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉంచాడు. అదే సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, నిలిపి ఉంచిన లారీలో ఉన్న సల్మాన్పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన సల్మాన్ను స్థానికులు వెంటనే ఇందల్వాయిలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన దుండగులు, తాము వచ్చిన లారీని చంద్రాయన్పల్లి వరకు తీసుకువెళ్లి, అక్కడ ఒక దాబా వద్ద వదిలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.



