అందంగా కనిపించాలని చర్మానికి క్రీములు, లోషన్లు రాస్తాం. జుట్టు, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ పాదాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తాం. కాలి పగుళ్లు బాధించడమే కాదు చూడ్డానికీ బాగోవు. వీటికి ఈ కాలంలో ఫంగస్ కూడా చేరితే మరింత ఇబ్బంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి…
‘ యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె.. పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్గా పని చేస్తుంది. రోజూ రాత్రిపూట పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా దీన్ని రాసి అరగంటయ్యాక శుభ్రం చేయండి. కాళ్లను తడి లేకుండా తుడుచుకోండి.
‘ కొబ్బరినూనెలో కాస్త కర్పూరం అరగదీసి పాదాలు, వేళ్ల సందుల్లో రాయండి. ఒరుపులు, పగుళ్లు తగ్గుతాయి.
‘ బేకింగ్ సోడా నీటిలో కలిపి కాళ్లను శుభ్రం చేయాలి. తడిలేకుండా పొడివస్త్రంతో తుడిచి పెట్రోలియం జెల్లీ రాయండి. రెండు సమస్యలూ అదుపులోకి వస్తాయి. వారానికోసారైనా ఆలివ్నూనెకు కాస్త గులాబీనీరు కలిపి పాదాలకు రాయండి. మంచి ఔషధంగా పనిచేస్తుంది.
‘ రాత్రి పడుకునేముందు పాదాల పగుళ్లకు వెన్న లేదా వ్యాజిలిన్ రాస్తే మృదువుగా అవుతాయి. పక్కబట్టలకు అంటకుండా సాక్స్ లేదా పాత దుప్పటి వేసుకోవచ్చు.
‘ నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పు క్రమం తప్పక తింటే కాళ్లు పగలవు.
‘ కాళ్లను కొంచెం నాననిచ్చి స్క్రబ్బర్ లేదా ప్యూమైన్ స్టోన్తో రుద్దాలి. తరచూ ఇలా చేస్తే పగుళ్లు పోతాయి.
‘ పగిలిన పాదాలకు అరటిపండు గుజ్జు రాయాలి. ఇందులో ఉండే ఎ, బి6, సి విటమిన్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.