కండువా కప్పి స్వాగతించ్చిన కేటీఆర్, హరీశ్రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బుధవారం ఆయన పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించ్చారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హమీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్ను తిరిగి సీఎంను చేయాలని ఆయన కోరారు. తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ పరిపాలనను వదిలిపెట్టారని అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి వాటి అమలును పూర్తిగా విస్మరించారని తెలిపారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాల మీద పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. గతంలో పార్టీ నాయకులతోపాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకు వెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



