Friday, November 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశమంతా సన్నబియ్యం ఇవ్వండి

దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి

- Advertisement -

కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి సలహా
రాష్ట్రంలో ఈ పథకం సక్సెస్‌ అయ్యిందని వెల్లడి
దీనివల్ల బియ్యం మార్కెట్‌ ధరలు స్థిరపడ్డాయని వివరణ
సీఎం విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందనీ, దీన్ని దేశమంతా విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామనీ, దీనివల్ల పీడీఎస్‌ బియ్యం రీ సైక్లింగ్‌ తగ్గి, బహిరంగ మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయని వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పారు. దీనిపై కేంద్రంమంత్రి ప్రహ్లాద్‌జోషీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకుటుందని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించాలంటూ సీఎం పలు అంశాలను కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కోటా పెంచాలని కోరారు. పీడిఎస్‌ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.343.27 కోట్ల సబ్సిడీని కూడా విడుదల చేయాలని కోరారు. 2024-25 ఖరీఫ్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ వ్యవధి పొడిగించాలనీ, ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్‌ రైస్‌ ర్యాక్‌లు కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

2025-26 ఖరీఫ్‌లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషీ సానుకూలంగా స్పందించారు. త్వరలో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌ అవసరం తగ్గిందనీ, అందువల్ల మిల్లింగ్‌కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -