– ఉన్నత చదువులకు అవకాశం
– అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
– డీజీపీ జితేందర్, వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి సంతకాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసు శాఖలో కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఉన్నత చదువులు చదవటానికి గానూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో రాష్ట్ర పోలీసు శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ జితేందర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్(వీసీ) ఘంటా చక్రపాణిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో ఎస్సెస్సీ స్థాయిలో కానిస్టేబుల్గా ఉద్యోగాలలో చేరిన సిబ్బందికి ఉన్నతస్థాయి చదువులు చదవటానికిగానూ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఆరు సంవత్సరాల పాటు డిగ్రీ చదవటానికి గానూ కానిస్టేబుళ్లకు మంచి అవకాశం దక్కుతుందని అన్నారు. ఉన్నతస్థాయి చదువులు కానిస్టేబుళ్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచటమేగాక సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని మరింతగా అనుమడింపజేస్తాయని ఆయన తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలలో చేరటానికి ప్రస్తుతం ఇంటర్మీడియట్ స్థాయి విద్యను అర్హతగా నిర్ణయించటం జరిగిందనీ, అంతకముందు పదో తరగతి స్థాయిలోనే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగేదని ఆయన గుర్తు చేశారు. అలాంటి కానిస్టేబుళ్లకు తాజా ఒప్పందం వారి ఉన్నతస్థాయి చదువులు దాహాన్ని తీర్చుకోవటానికి ఎంతగానో దోహదపరుస్తుందని తెలిపారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. దాదాపు 30 వేల మంది కానిస్టేబుళ్లకు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవటానికి తాము చేసుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే ఆర్మీకి చెందిన సైనికులకు ఈ అవకాశం కల్పించటం జరిగిందని ఆయన అన్నారు. తాజాగా పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుళ్లకు ప్రత్యేకించి డిగ్రీ కోర్సులను కూడా రూపొందించటం జరిగిందని ఆయన తెలిపారు. ట్రైనింగ్ అదనపు డీజీ వి.వి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. కానిస్టేబుళ్లకు ఈ డిగ్రీ అవకాశం వారిలో మరింతగా పరిణితిని పెంచటానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES