– ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
– స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ-భూపాలపల్లి
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కరస్నానం ఆచరించి ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా త్రివేణి సంగమం సరస్వతి ఘాట్ వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు చేరుకున్నారు. సరస్వతి ఘాట్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పుణ్యస్నానమాచరించారు. అనంతరం సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఆలయ పూజారులు పరిచట్టం, పూర్ణ కుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు వారికి ఆశీర్వచనం అందించి, శ్వేత వస్త్రం, లడ్డూ ప్రసాదం, చక్కెర పొంగలి అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రతి రోజూ సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమాన్ని వివరించారు. పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించి అధికారులను అభినందించారు. 11 రోజుల నుంచి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయ ని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగాన్ని అధికారులను, సిబ్బందిని గవర్నర్ అభినందించారు.
త్రివేణి సంగమంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES