నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
బాన్స్వాడ నియోజకవర్గంలో శనివారం రాత్రి, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతుల వరి ధాన్యాన్ని తడిపేసింది. రైతులు రాత్రిపూట ధాన్యం తడ వకుండా ఉండేందుకు నానా తిప్పలు పడ్డారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జాప్యం కారణంగానే ధాన్యం తడిసినట్లు రైతులు ఆరోపించడం గమనార్హం. బీర్కూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో రైతు ఆరబోసిన ధాన్యం రాత్రి మరియు తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి వరి, మొక్క జొన్న పంట కల్లాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది.
నసురుల్లాబాద్ మండల పరిధిలో దుర్కి, మిర్జాపూర్, మైలారం, నసురుల్లాబాద్ తోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం తడిసి పోయింది. ఈదురు గాలులకు పలుచోట్ల వరిపంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.



