నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఎస్టీ బాలుర వసతి గృహం మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత సోమవారం వినతి పత్రం అందించారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 2013 వ సంవత్సరంలో ప్రారంభం అయినప్పటి నుండి అశ్వారావుపేట,దమ్మపేట మండలాల కు చెందిన విద్యార్థులు ఈ కళాశాల లోనే ఇంటర్మీడియట్ విద్య ను అభ్యసిస్తున్నారు అని, నియోజకవర్గం మొత్తం ఏజన్సీ ప్రాంతం అయినందున కళాశాల లో 90 శాతం గిరిజన విద్యార్థులు చదువు చున్నారు అని, చాలా గ్రామాల నుండి విద్యార్థులు రావడానికి బస్ సౌకర్యం కూడా లేదు అని,అనేక పర్యాయాలు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం అధికారిని కలిసి ఎస్టీ బాయ్స్ హాస్టల్ అవసరం గూర్చి విన్నవించామని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినప్పటికీ గిరిజన విద్యార్థులకు హాస్టల్ మంజూరు కాలేదని అన్నారు.
ఈ ప్రాంతములో నాలుగు ఎస్టీ బాలుర ఆశ్రమ స్కూల్స్ నుండి సుమారు 250 నుండి 300 మంది గిరిజన విద్యార్ధులు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ విద్య కొరకు వస్తున్నారు. ఇంటర్మీడియట్ లో జాయినింగ్ అయిన తరువాత వీరికి హాస్టల్ వసతి లేనందున వీరు ఇంటర్మీడియట్ విద్యను మధ్యలోనే నిలిపివేయడంతో ఉన్నత విద్యను పొందలేక పోతున్నారని తెలిపారు. కావున గిరిజన విద్యార్థుల యందు దయ ఉంచి అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గిరిజన బాలుర వసతి గృహమును మంజూరు చేయించాలని కోరారు.
ఈ కళాశాలలో చదువుకు నే ఎస్సీ విద్యార్థులకు బాలుర హాస్టల్ అశ్వారావుపేట లోని రింగ్ రోడ్డు ప్రభుత్వ పాత ఆసుపత్రి దగ్గరఉన్నది.అది కళాశాలకు దూరంగా ఉన్నందున ఆ హాస్టల్ ప్రాంగణంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నదని మా దృష్టికి వచ్చినది మరియు విద్యార్థులు అక్కడి నుండి జూనియర్ కళాశాలకు రావడానికి ఇబ్బందులు పడుచున్నారు.ఈ కళాశాల కు అనుబంధంగా గిరిజన బాలుర హాస్టల్ ను ఈ కళాశాల కు దగ్గరలో మంజూరి చేసినట్లయితే మన కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్స్ పెరగడం తో పాటుగా కళాశాల పబ్లిక్ పరీక్షల ఫలితాలు కూడా పెరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు.కావున ఈ జూనియర్ కళాశాలకు గిరిజన బాలుర వసతి గృహమును మంజూరు చేయించాలని కోరారు.