పతంజలికి అలహాబాద్ హైకోర్టు షాక్
అలహాబాద్ : తనపై విధించిన రూ.273.50 కోట్ల జీఎస్టీ జరిమానాను సవాలు చేస్తూ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్ట్ తోసిపుచ్చింది. క్రిమి నల్ విచారణ తర్వాతే ఇలాంటి జరిమా నాలు విధించాలన్న పతంజలి వాదనతో న్యాయమూర్తులు శేఖర్ బి. సరాఫ్, విపిన్ చంద్ర దీక్షిత్తో కూడిన డివిజన్ బెంచ్ ఏకీభవించ లేదు. క్రిమినల్ కోర్టు విచారణ అవసరం లేకుండానే సివిల్ వ్యాజ్యం ద్వారా జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 122 కింద పన్ను అధికారులు జరిమానాలు విధించవచ్చునని బెంచ్ తేల్చి చెప్పింది. జీఎస్టీ జరిమానా ప్రొసీడింగ్స్కు సివిల్ స్వభావం ఉన్నదని, కాబట్టి వాటిపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోవచ్చునని వివరణ ఇచ్చింది.
పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్కు హరిద్వార్ (ఉత్తరాఖండ్), సోనీపట్ (హర్యానా), అహ్మద్నగర్ (మహారాష్ట్ర)లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ అధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తు జరిపారు. వస్తువులను సరఫరా చేయకుండా కేవలం కాగితాలపై పన్ను ఇన్వాయిస్లు చూపిందంటూ దర్యాప్తు సందర్భంగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఘజియాబాద్కు చెందిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) గత సంవత్సరం ఏప్రిల్ 19న పతంజలి ఆయుర్వేద్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 122 (1) కింద రూ.273.51 కోట్ల జరిమానాను అందులో ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 10న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా పన్ను డిమాండ్లను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ జరిమానా ప్రొసీడింగ్స్ను కొనసాగించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో పతంజలి సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పతంజలి పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
జీఎస్టీ జరిమానా కట్టాల్సిందే
- Advertisement -
- Advertisement -