– కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
దళిత విద్యార్థినీ విద్యార్థులు.. బాత్రూమ్లు కడగాలని, తరగతి గదులు, హాస్టల్ రూములు శుభ్రం చేసుకోవాలంటూ దళిత విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడిన గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణిని తక్షణమే సస్పెండ్ చేయాలని కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి దళితుల్ని అవమానపరిచిన తీరు చాలా అభ్యంతరకరమన్నారు. దళిత పిల్లలు వారు ఏమైనా రాజ సింహాసనం నుంచి వచ్చారా.. వారేమైనా రాజులా అన్నట్టు వెటకారంగా మాట్లాడటం విద్యార్ధులను అవమానించడమేనని అన్నారు. అలుగు వర్షిణి తమ ఆఫీసు బాత్రూమ్లను వారే కడుక్కుంటున్నారా, ఆఫీసు రూములను వారే ఊడ్చుకుంటున్నారా.. అని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్ అధికారి విద్యార్థిలోకాన్ని అవమానించడం శోచనీయమన్నారు. ఈ అవమానాలతో వారి చదువులు ఎలా సాగాలని ప్రశ్నించారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగం వల్ల ఈరోజు అట్టడుగు బడుగు, బలహీన వర్గాలు చదువులు, ఆటలు, ఉద్యోగాల్లో రాణిస్తుంటే అది చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మంత్రివర్గంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నేతలు వివేక్ వెంకటస్వామి లాంటి వారు చొరవ తీసుకుని ఆమెను సస్పెండ్ చేయించి గురుకులాలను కాపాడాలని అన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు సలవాల నర్సయ్య, జిల్లా నాయకులు జంగం గంగాధర్, సంపత్, రాజు, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణినివెంటనే సస్పెండ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES