రాష్ట్ర హస్తకళాభివృద్ధి చైర్మెన్ నాయుడు సత్యనారాయణ
ఎన్టీఆర్ స్టేడియంలో గోల్కొండ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం
నవతెలంగాణ – ముషీరాబాద్
హస్తకళా ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మెన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. కళాకారుల సాధికారతకు సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో హస్తకళల అభివృద్ధి సంస్థ, నాబార్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ”గోల్కొండ క్రాఫ్ట్స్, టెక్స్టైల్స్” మేళాను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చేనేత, హస్తకళలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో సంస్థ పని చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా కళాకారులు వారి ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి అవసరమైన మెషినరీ సహా అన్ని వసతులూ కల్పిస్తున్నామని వివరించారు.
హస్తకళా ఉత్పత్తులు, చేనేత వినియోగాన్ని పెంచడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ మేళాలో తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 130 స్టాళ్లను ఏర్పాటు చేశారు. బిద్రి, డోక్రా కళారూపాలు, నిర్మల్ పెయింటింగ్స్, ముత్యాలు, ఇమిటేషన్ జ్యువలరీ, జ్యూట్ వస్తువులు, బెంగాల్, కాశ్మీరీ, చందేరి చీరలు సహా విభిన్న రకాల హస్తకళా ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లు ప్రదర్శనలో ఉన్నాయి. హస్త కళాకారుల ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక మేళా జనవరి 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్, ఓఎస్ డీఎస్ఎం భాషా, సంస్థ మేనేజర్లు ఎస్.నాగేశ్వర్, ఎండీమసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.



