Wednesday, October 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలులంచం కోసం వేధింపులు

లంచం కోసం వేధింపులు

- Advertisement -

– ఎమ్మార్వో కార్యాలయం ఎదుట యువ రైతు ఆత్మహత్యాయత్నం
– దుండిగల్‌ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
– రైతును అడ్డుకుని రక్షించిన పోలీసులు
నవతెలంగాణ-దుండిగల్‌

రెవెన్యూ అధికారులు లంచం అడుగుతూ వేధిస్తు న్నారని ఓ యువ రైతు ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే ఆత్మహత్యా యత్నం చేసుకు న్నాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని దుండి గల్‌ మండల కేంద్రంలో మంగళ వారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నంబర్లు 148, 150లో తన కుటుంబానికి కేటాయించిన భూదాన్‌ భూములకు సంబంధించి పట్టా, పాస్‌బుక్‌ కోసం రైతు సిద్దు కొన్ని నెలలుగా తహసీల్దార్‌ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే, తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. అయితే, ఆ పని చేసేందుకు రెవెన్యూ అధికారులు రూ.6 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాంతో మనస్తాపానికి గురైన రైతు కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్‌ కాపీతోపాటు, చేతిలో ఒక లేఖ పట్టుకుని మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. అక్కడ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. ”రెవెన్యూ అధికారుల అవినీతి తీరుతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్న పోలీసులు, స్థానికులు అప్రమత్తమై అతన్ని అడ్డుకుని రక్షించారు. అనంతరం రైతును ఎమ్మార్వో వద్దకు తీసుకెళ్లారు. బాధితుడికి ఎంఆర్‌ఓ ఎండీ మతిన్‌ నచ్చజెప్పి భూమి పత్రాలు తీసుకుని రేపటిలోగా పని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, గిరిజనుడైన సిద్దును అధికారులు కులం పేరుతో అవమానించారని, ”మీ జాతి వాళ్లు ఆఫీసులోకి రాకూడదు” అని తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అవమానం, లంచం డిమాండ్లతో విసిగిపోయిన సిద్దు చివరికి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -