కంట్రీబ్యూషన్ను ప్రభుత్వమే చెల్లించాలి
ప్రత్యేకంగా హెల్త్కేర్ ట్రస్టును ఏర్పాటు చేయాలి : సీఎస్కు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకూ హెల్త్కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్యూజే) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశాయి. జర్నలిస్టుల తరపున కంట్రీబ్యూషన్ను ఆరోగ్య బీమా సంస్థలకు ప్రభుత్వమే చెల్లించాలని కోరాయి. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, హెచ్యూజే అధ్యక్షులు బి.అరుణ్కుమార్, కార్యదర్శి బి.జగదీశ్వర్, ఉపాధ్యక్షులు క్రాంతి, కోశాధికారి బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు గండ్ర నవీన్, బి. దామోదర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో వందలాది మంది జర్నలిస్టులు చనిపోయారని గుర్తు చేశారు.
సరైన వైద్యపరమైన సేవలు అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా హెల్త్కేర్ ట్రస్టును ఏర్పాటు చేసి పరిమితి లేని వైద్యసేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని గుర్తు చేశారు. ఇదే తరహాలో గతంలో మాదిరిగా ఉద్యోగులు, జర్నలిస్టులను కలిపి హెల్త్కేర్ ట్రస్టును ఏర్పాటు చేయాలని సూచించారు. జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల నేపథ్యంలో ఆరోగ్య బీమాకు అవసరమయ్యే ప్రీమియంను ప్రభుత్వమే సమకూర్చాలని ప్రధానకార్యదర్శికి సూచించారు. ఇందుకోసం అవసరమైతే జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహించాలని తెలియజేశారు. ఈసందర్భంగా హెచ్యూజే మీడియా డైరీ -2026 కాపీని సీఎస్కు అందజేశారు.



