క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచంలో మూడింట రెండు వంతులు క్యాన్సర్ మరణాలు పేద మధ్యతరగతి దేశాల్లో సంభవిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
క్యాన్సర్ పై సరియైన అవగాహన లేకపోవడం వలన, క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుంది. మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ వ్యాధి ముదిరిన తరువాత ఇది నిర్ధారణ అవుతుంది. దీనివల్ల బ్రతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. క్యాన్సర్ పట్ల సరియైన అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, పలు అపోహలు, భయాలు ఎక్కువైపోతున్నాయి.
క్యాన్సర్ గురించి ఒక సమగ్రమైన ఆలోచన, అవగాహన కలగాలంటే, ముందుగా క్యాన్సర్ అంటే ఏమిటి ? ఎన్ని రూపాలలో క్యాన్సర్ వస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. ఏ సమయంలో ఏ వైద్యం అవసరమవుతుంది? మొదలైన అనేక విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. భయాన్ని వీడి తెలుసుకోవాలనే ఆలోచనను కలిగి తగిన సూచనలను పాటించడంతోపాటు, తగిన చికిత్సను చేసుకోవడం వల్ల క్యాన్సర్ను ఎదుర్కోవచ్చు. ముందుగా ఎంత త్వరగా గుర్తించి చికిత్సకు సిద్ధమైతే, అంత క్షేమంగా క్యాన్సర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు.
రచయిత్రి సమ్మెట విజయ క్యాన్సర్ సోకిన 21 మందిని కలిసి వారి కథనాలను పొందుపరిచి ”ఆశే శ్వాసగా” అనే ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో క్యాన్సర్ వచ్చిన వారు, క్యాన్సర్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, క్యాన్సర్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది – ఇలా అందరి ప్రమేయాన్ని ఇందులో వివరించారు. ఈ పుస్తకంలో సేకరించిన 21 మందిలో పదిమంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వారు ఉన్నారు. ఎక్కువమంది స్త్రీలలో ఈ క్యాన్సర్ రావడం, దాని పర్యవసనాలు – వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేయించుకున్న వైద్యం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మనకు తెలిసి మున్ముందు ఈ క్యాన్సర్ వచ్చినవారికి వీరు అనుసరించిన వైద్య విధానం ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇది కాకుండా సర్వైకల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ మరికొన్ని రకరకాల క్యాన్సర్లు వచ్చిన వారున్నారు. వారిలో కొందరికి క్యాన్సర్ అంటే తెలియదు. క్యాన్సర్ తమకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కొందరికి వారి కుటుంబంలో అంతకుముందే క్యాన్సర్ వచ్చి, క్యాన్సర్ పట్ల కొంత అవగాహన ఉన్నవారు ఉన్నారు. అటువంటివారు కొందరు వచ్చిన దానిని స్వీకరించారు. కొందరు జీర్ణించుకోలేక లోపల నలిగిపోయారు. మరికొందరు తమ అనుభవాలతో ఎదుటివారికి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. కొందరు కాగడా చేతిలో పట్టుకొని క్యాన్సర్ బాధితులకు వెలుగును పంచే ధీరత్వాన్ని ప్రదర్శించారు. ఒడిదుడుకులను ఎదుర్కొని మొదట్లోనే మేల్కొని ధైర్యాన్ని కూడ కట్టుకొని తగిన వైద్యం చేసుకుని, క్యాన్సర్ నయం చేసుకున్న వీరి కథనాలు మిగతా వారికి ధైర్యాన్ని కలుగజేస్తాయి. మొత్తానికి క్యాన్సర్ వచ్చిన వారిని పలకరించడం, పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం, వారు కోలుకోగలరు అనే ఆత్మవిశ్వాసాన్ని నింపడమే మనం చేయాల్సిన పని.
– కె.పి.అశోక్ కుమార్
9700000948
క్యాన్సర్ ను జయించడం ఎలా?
- Advertisement -
- Advertisement -