నవతెలంగాణ-హైదరాబాద్: నార్కో ఉగ్రవాద ఆరోపణల్లో నేను దోషిని కాదు అని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం న్యూయార్క్ కోర్టులో న్యాయమూర్తికి చెప్పారు. అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆయన్ని నిర్బంధించిన రెండు రోజుల తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన కోర్టులో స్పానిష్లో మాట్లాడారు. ‘నేను మంచి మనిషిని. నేను ఇప్పటికీ నా దేశ అధ్యక్షుడినే’ అని న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్స్టెయిన్ ముందు అన్నారు. దీనికి న్యాయమూర్తి.. తాను నిర్దోషిగా నిరూపించుకునే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మదురోపై వచ్చిన నాలుగు ఆరోపణలకు తాను నిర్దోషిని అని నిరూపించేందుకు పిటిషన్ వేస్తున్నట్లు మదురో తరపు న్యాయవాది బారీ పోలాక్ కోర్టుకు చెప్పారు.
కాగా, కోర్టులో మదురో.. తనపై నమోదైన నేరారోపణను తాను ఇంకా చూడలేదని, తనకు చట్టపరమైన హక్కుల గురించి కూడా తెలియదని కోర్టుకు తెలిపారు. ఒకవేళ ఇప్పుడు హక్కుల గురించి తెలిస్తే న్యాయమూర్తి ద్వారానే తెలుస్తాయని ఆయన అన్నారు. వెనిజులాలోని కారకాస్లోని ఇంట్లో ఉన్న సమయంలో తనని బంధించినట్లు మదురో కోర్టులో చెప్పారు.
మదురో జైలు దుస్తులు ధరించి, కాళ్లకు సంకెళ్లు వేసి, అనువాదానికి హెడ్ఫోన్లు ధరించి కోర్టు గదిలోకి ప్రవేశించారు. ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ కూడా జైలు దుస్తులు ధరించారు. కోర్టు గదిలోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరి సంకెళ్లని విప్పారు. మదురో తన తరపు న్యాయవాదితో కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. అలాగే ఈ సందర్బంగా మదురో భార్య ఫ్లోర్స్ ‘నేను వెనిజులా రిపబ్లిక్ ప్రథమ మహిళను. దోషిని కాదు అని ఆమె అన్నారు. దీనిపై తదుపరి విచారణ మార్చి 17కి వాయిదా వేశారు.
మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్ వెనుకంజ వేసి.. అమెరికాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. రోడ్రిగజ్ ఆదివారం మీకు ఏం కావాలి అని ట్రంప్ని అడిగినప్పుడు.. ‘మా దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి వెనిజులాలోని చమురు, వస్తువులు మాకు అవసరం’ అని ట్రంప్ బదులిచ్చారు. ఆదివారం మదురోకి మద్దతుగా.. సుమారు రెండు వేల మంది మద్దతుదారులు కారకాస్లో ర్యాలీ నిర్వహించారు. సోమవారం తిరిగి పార్లమెంటుకు ఎన్నికైన అధ్యక్షురాలు సోదరుడు జార్జ్ రోడ్రిగ్జ్… మదురోను వెనక్కి తీసుకురావడానికి గల అన్ని ప్రయత్నాలను చేస్తామని హామీనిచ్చారు.



