”నేనే చేశాను… నేనే చేశాను…. అంతా నా మాటే విన్నారు. నామాటే శాసనం. యుద్ధం ఆపింది నేనే. ప్రపంచమంతా నా మాట వినాల్సిందే. వింటుంది కూడా” నిద్రలో కలవరిస్తున్న యాద్గిరి మొహంపై కొన్ని నీళ్లు చల్లింది ఆయన శ్రీమతి సురేఖ. కండ్లు తెరిచి చూశాడు.
”ఇందంతా కలనా? నేను అమెరికా అధ్యక్షుడిని కానా? ఎందుకు లేపావు సురేఖా, కలలో నా వైభవం నేనే చూడలేకపోయాననుకో”.
”ఇంకా నయం ఆ కల అలాగే కొనసాగివుంటే ఏమేమి మాట్లాడేవాడివో”
”మంచి ఐడియా ఇచ్చావ్, ఒక పని చేస్తా, మళ్లీ నిద్రపోతా, ఆ కల తిరిగి వస్తుందేమో”
”నీవేమన్నా విశ్వనాథవారి నవలలో నాయకుడివా? రోజూ పడుకున్నాక నిన్న ఆగిపోయిన కల ఎక్కడ ఆగిందో అక్కడ మొదలవ్వడానికి? నిజజీవితంలో అవి జరగవ్ గుర్తుపెట్టుకో”
”అంతేనంటావా….!!”
”నూటికి నూరుశాతం అంతే”
”నీ ఎమ్మే తెలుగునంతా నామీద వాడొద్దని చెప్పానా. ఒకోసారి ఒకో మహానుభావుడిపేరు చెబుతావ్. మా కామర్సు బ్లాకు దగ్గరే మీ తెలుగు శాఖ ఉండబట్టి చేసుకున్నాము. నేను కూడా తెలుగు శాఖలోనే ఉంటే బాగుండేదేమో”
”అప్పుడు నీబదులు ఇంకో కామర్సు విద్యార్థి పరిచయమయ్యేవాడో ఏమో” ఉడికించింది
”అమ్మో వద్దులే, ముందే కలలోంచి పూర్తిగా బయటకు రాలేకుండా ఉన్నాను, నీ మాటలతో షాక్ కొడుతోంది”
”నేనే చేశాను అంటూ అరుస్తుంటే వంటగానీ చేశారేమో అనుకున్నా. ప్చ్ … కలలు కనడం, కలవరించడం ఎవరైనా చేయగలరు.
నిజజీవితంలో ఏమి చేస్తున్నావన్నది ముఖ్యం.”
నేను, నాది, నాకు అన్న మాటలే ఈకాలంలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వాడే మేము, మాది, మాకు అన్నవి మరచిపోయారు జనాలిప్పుడు. కిస్సాకుర్సీకా. కుర్చీ ఎక్కడమే పరమావధి. అందులో కుదురుకున్నాక ఎక్కువరోజులు ఎలా ఉండాలో అన్నది తరువాత మెద డును ఆక్రమించే ఆలోచన. దేశ దేశాల ప్రధానులు, అధ్యక్షులు అందరిదీ ఇదే వరుస. టీవీల్లో, సోషల్ మీడియాలో, పేపర్లలో ఎక్కడ చూసినా ఇవే వార్తలు. నేనది చేశాను, నేనిది చేశాను అని. అధికారంలో ఉన్నోళ్లు, లేనోళ్లు ఇవే మాటలు. ఒకరు వర్తమానం మాట్లాడితే ఇంకొకరు గతం గురించి మాట్లాడతారు.
ఇలా అన్నీ నేనే చేశాను అనుకునే తండ్రికి కొడుకు కరెంటు షాకులాంటి డైలాగు కొడతాడు ఓ సినిమాలోని నాయకుడు. ఎలాంటి బట్టలేసుకోవాలో, ఏమి చదువుకోవాలో, ఎలా మసలుకోవాలో, చివరికి క్యారం బోర్డులో ఏ కాయన్ వేయాలో అనీ అనీ మీరే చెబుతారు నాన్నా, అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు అనంటాడు. హీరో తండ్రి మెదడు ఒక్కసారి పనిచేయనట్టు అయిపోతుంది. భార్యవైపు చూస్తాడు, ఆమె తల తిప్పుకుంటుంది, పెద్దకొడుకు, కోడలు వైపూ చూస్తాడు. వాళ్లూ అంతే అటు తిరుగుతారు ఎందుకంటే దర్శకుడు అలాగే చెప్పి ఉంటాడు కాబట్టి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎవరి పనులు వారే చేసుకోవాలి వయసును బట్టి. అంతే కాని పొద్దస్తమానమూ అన్నీ చిలక్కి చెప్పినట్టు చెబుతూ ఉంటే పిల్లలకి సరిపోదు.
పిల్లలకే అలా ఉంటే రాష్ట్రాలను, దేశాలను పాలిస్తున్న నాయకులకు ఎలా ఉంటుంది? ఎక్కడో ఉండి అన్నీ నేనే చేశాను అంటే. ఫలానా చోట్ల బాంబులు వేశాము, అక్కడంతా నాశనం, అణ్వాయుధాలు తయారుచేసే స్థావరాలు నేలమట్టం అని, రెండురోజులు కాకముందే అవన్నీ సురక్షితంగా ఉన్నాయని తనవాళ్లే చెబుతుంటే బెత్తం పట్టుకొని తిరిగేవారికి ఎలా ఉంటుంది. అసలు నీ చేతికి ఆ బెత్తం ఎవరిచ్చారసలు అని ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో? అంత తొందరగా జనాలు మారరని ఇంతకుముందే అనుకున్నాం కానీ మారక తప్పని పరిస్థితి.
అసలు యుద్ధాలు ఎందుకు ఎప్పుడు మొదలవుతున్నాయో ఎప్పుడు ఆగిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. అటువంట ప్పుడు వాటిని ఆపాననడం ఓ తమాషా వ్యవహారం. ఒక దేశంలోనేమో సంవత్సరమంతా అక్కడిపౌరులనే చంపుతూ ఉంటే ఆపలేని ఈ పెద్దరికం చంపే వాళ్లకే సహాయం చేస్తూ కూడా ఉంది. దీన్ని సహించలేని ఇంకోదేశం తానూ రంగం లోకి దిగితే అదే పెద్దరికం రంగంలోకి తానే వస్తుంది. అసలు నేనొస్తే యుద్ధాలే ఉండవన్న పెద్దాయన తానే యుద్ధంలో పాల్గ్గొని ఆపేసి చెబుతున్న మాటలే తమాషాగా ఉన్నాయి.
మొత్తమ్మీద నీవు అన్నీ చేస్తున్నావా, లేక అన్నీ చూస్తున్నావా. చేస్తే ఎవరికి సహాయం చేస్తున్నావు, నిజంగా చూస్తే పసిపిల్లల, స్త్రీల,వృద్ధుల మరణాలు కనిపించవా? ఆసుపత్రులపై, పునరావాస కేంద్రాలపై దాడులను ఎందుకని చేస్తున్నారు. నీవు వారికి సహాయపడుతున్నావా లేదా? వీటన్నింటిని ఆపి అప్పుడు చెప్పు నేనే చేశాను, నేనే ఆపాను అని. దానికి కొద్దిగ విలువ ఉంటుంది. అవి ఆపడానికి వ్యాపారాలు అడ్డొస్తాయి. అందుకే వేరే సాకులు కావాలి. చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అటెండర్ ఉండేవాడు. చేతిలో ఓ బెత్తం ఉండేది. వరండాలో ఎవ్వరూ లేకుండా చూసేవాడు. ఆయన్ని వరండా ప్రిన్సిపాల్ అనేవారు.
వరండా అయితేనేమి పాఠశాల అయితేనేమీ ప్రిన్సిపాలు ప్రిన్సిపాలే. ఆవిధంగా ఇవ్వని బాధ్యతల్ని తీసుకుని అధికారం చెలాయించేవారే అన్నీ నేనే చేశాను అనుకుంటుంటారు. ఏదైతేనేం ఈ ఆర్టికల్ నేనే రాశాను……
జంధ్యాల రఘుబాబు
9849753298
నేనే చేశాను…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES