నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. ముఖ్యంగా వన్డే బ్యాటింగ్ జాబితాలో టాప్-5 స్థానాల్లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండటం విశేషం. భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నాలుగో ర్యాంకులో నిలకడగా కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండో స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకుకు పడిపోయాడు. తాజాగా వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో దారుణంగా విఫలం కావడమే బాబర్ ర్యాంకు పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో అతను కేవలం 18.66 సగటుతో 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. మరో భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కూడా ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకుని టాప్-10లో కొనసాగుతున్నాడు.
