నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ సంస్థనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి పోయిందనీ, తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే మేమొచ్చి బాగు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీకి పునర్వైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో లబ్దిదారులకు స్మార్టుకార్డుల అందజేత, మహాలక్ష్మి పథకం బకాయిలు ఆర్టీసీకి చెల్లింపు, ఆర్టీసీకి కొత్త బస్సుల కొనుగోలు, తదితరాలపై బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టి.హరీశ్రావు, జాటోతు రామ్చందర్నాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, స్వయం సహాయక బందాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటా బేస్లు వివిధ వనరుల నుండి స్మార్ట్ కార్డుల కోసం లబ్ధిదారుల డేటా సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని మూసేస్తామనీ, 43 వేల మందిపై వేటు వేస్తామని భయబ్రాం తులకు గురిచేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క కొత్త బస్సును కూడా కొనుగోలు చేయలేదనీ, ఉద్యోగులను నియమిం చలేదని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వం వచ్చాక రెండేండ్లలో 2,600 కొత్త బస్సులను కొనుగోలు చేశామనీ, ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. 15 ఏండ్లు పైబడిన బస్సులను స్క్రాప్కు పంపిస్తున్నామన్నారు. చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ అయిన వారిని విధుల్లోకి తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తే…తమ ప్రభుత్వం దానిపై త్రీమెన్ కమిటీ వేసి 250 మంది ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నదని గర్వంగా చెప్పారు. మహిళా సంఘాల సభ్యులను 600 బస్సులకు యజమానులుగా చేశామని గుర్తు చేశారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని చెప్పారు. మహా లక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బస్సుల డిమాండ్ పెరిగిందనీ, హైదరాబాద్లో 349 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని వివరించారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, సీసీఎస్, పీఎఫ్, పెండింగ్ బకాయిలు క్రమంగా చెల్లిస్తున్నా మన్నారు. ఆర్టీసీ లో ఉద్యోగుల విలీనం, గుర్తింపు సంఘం కోసం ఎన్నికకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం,ప్రయాణికుల సౌల్యభం తమ ప్రజాప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. మహా లక్ష్మీ పథకం వచ్చిన తర్వాత 85 శాతానికి పైగా ఓఆర్ ఉందనీ, ఆర్టీసీకి ఎప్పటికప్పుడు మహాలక్ష్మి పథకం నిధులు చెల్లిస్తున్నామని తెలిపారు.
బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో పంటలకు నీళ్లు అందించే విషయంపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కాంగ్రెస్ సభ్యులు కుంభం అనిల్కు మార్రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సింగూరు ప్రాజెక్టుపైనా, భూసేకరణ పైనా బీఆర్ఎస్ సభ్యులు సునీతాలక్ష్మారెడ్డి, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు రూ.135 కోట్ల కేటాయింపుపై బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్బాబు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్యాకేజీల పూర్తిపై బీఆర్ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్కు మార్రెడ్డి సమాధానాలిచ్చారు. కాలువ పంపిణీ నెట్వర్క్ వ్యవస్థ పూర్తి అయిన తర్వాత 1,88,500 ఎకరాలకు నీటిని సరఫరా చేస్తున్నా మన్నారు. పంపిణీ వ్యవస్థ పనులు పురోగతిలో ఉన్నాయనీ, పంపిణీ నెట్ వర్క్ పూర్తయిన తర్వాత నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ పెద్దవాగుపై జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయనీ, రూ.135 కోట్లు కేటాయిస్తే కాగజ్నగర్, దహేగాం మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభను కోరారు. సభ్యులు లేవనెత్తిన డిమాండ్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని మంత్రి హామీనిచ్చారు.
ఆర్టీసీని బీఆర్ఎస్ నిర్వీర్యం చేస్తే… మేమొచ్చి బాగు చేస్తున్నాం: మంత్రి పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



