రూ.8 కోట్ల విలువైన ఆభరణాలు…
న్యూఢిల్లీ : ఒక మనీలాండరింగ్ కేసులో దాదాపు రూ ఐదు కోట్ల నగదును, రూ ఎనిమిది కోట్లకు పైగా విలువైన అభరణాలు, రూ 35 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. భారీ విలువ కలిగిన ఒక ప్రయివేట్ లోన్ సెటిల్మెం ట్ కేసులో సోదాలు జరిపిన ఇడి వీటిని స్వాధీనం చేసుకుంది. ‘స్ట్రాంగ్ మ్యాన్’ ఇంద్రజీత్ సింగ్ యాదవ్, అతని సహచ రులు, అపోలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇతర అనుబంధ సంస్థలు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇంద్రజీత్ సహచరుల్లో ఒకడైన అమన్ కుమార్ నివాసంలో జరిపిన సోదాల్లో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఇడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంద్రజీత్ పరారీలో ఉన్నారు. యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన 15కు పైగా ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు అక్రమ దోపీడీ, ఆయుధాలతో బెదిరింపులు దౌర్జన్యంగా ప్రయివేట్ ఫైనాన్షియర్ల లోన్ సెటిల్మెంట్లు, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి కమిషన్ను సంపాదించడం వంటి అభియోగాలకు సంబంధించిందని ఇడి తెలిపింది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్లోని అమన్ కుమార్కు చెందిన నివాసంలో మంగళ, బుధవారల్లో ఈడీ సోదాలు జరిపింది.
లండన్లో రూ 150 కోట్ల విలువైన ఆస్తి ఎటాచ్మెంట్
లండన్లో రూ. 150 కోట్ల విలువైన ఆస్తి స్వాధీనం కోసం తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ను ఈడీ బుధవారం జారీ చేసింది. లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి నితిన్ శంభుకుమార్ కస్లివాల్, అతని కుటుంబ సభ్యులకు చెందినది. ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్ మాజీ చైర్మెన్, ఎండీ అయిన శంభుకుమార్, కుటుంబ సభ్యులు వివిధ భారతీయ బ్యాంకులను రూ. 1,400 కోట్ల వరకూ మోసం చేసినట్టు ఫిర్యాదులు ఉన్నాయని ఇడి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్ పేరుతో బ్యాంకులను మోసం చేసి, ఈ నిధులను విదేశీ పెట్టుబడుల ముసుగులో దేశం వెలుపలకు మళ్లించారని, ఆ తరువాత విదేశాల్లో స్థిరాస్థులను సంపాదించారని ఈడీ తెలిపింది. ఈ స్థిరాస్థులను తమ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్టుల కింద ఉంచారని తెలిపింది.
మనీలాండరింగ్ కేసులో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం
- Advertisement -
- Advertisement -



